
PV Sindhu’s Health Mantra: ప్రజలు ఫిట్నెస్ ట్రైనింగ్, వర్కౌట్స్ను ఎంత సీరియస్గా తీసుకుంటారో, అదే స్థాయిలో ముందస్తు వైద్య పరీక్షలు కూడా సీరియస్గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు. క్రీడాకారుల జీవితంలోనే కాకుండా సాధారణ వ్యక్తులు జీవితాల్లో వైద్య పరీక్షలు తప్పనిసరని సూచించారు. జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు హాజరయ్యారు.
ముందస్తు పరీక్షలే రక్షణ కవచం
ఈ సందర్భంగా పివీ సింధు మాట్లాడుతూ.. ఆరోగ్యం- ఆహార అలవాట్లపై తన అనుభవాలు పంచుకున్నారు. క్రీడకారులు ఫిట్నెస్ టెస్టులను ఎంత గౌరవిస్తారో, సామాన్యులు కూడా వైద్య పరీక్షలను కూడా అంతే గౌరవించాలని అన్నారు. వ్యాధులు రాకుండా, అనారోగ్యం బారిన పడకుండా వైద్య పరీక్షలు కూడా చాలా ముఖ్యం. ముందస్తు సంరక్షణ వల్లే తాను విజయాలను సాధిస్తున్నానని తెలిపారు. అదే సమయంలో ఒలింపిక్ పతకం గెలవడం కష్టమో. ఐస్క్రీమ్ వదిలేయడం కూడా కష్టమే అన్నారు. డిసిప్లిన్, కేర్, రెగ్యులర్ టెస్టుల వల్లనే తన కెరీర్ కొనసాగుతోందని అన్నారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పీవీ సింధు ఆందోళన వ్యక్తం చేశారు. నేటీ కాలంలో గూగుల్ను నమ్మకండి. ముందే టెస్టులు చేయించుకోండి. ఆలస్యంగా స్పందించడం కన్నా, సమస్య రాకముందే గుర్తించడం ముఖ్యమన్నారు. ఆరోగ్యంపై అలసత్వాన్ని వదిలివేయాలని సూచించారు. మనం ఎంత కష్టపడి శిక్షణ తీసుకుంటామనే దాని కంటే.. ఎప్పుడు? ఎలా విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యమన్నారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వలన సామర్థ్యం పెరుగుతుందనీ, కానీ మహిళలకు వ్యాధుల నివారణ కూడా చాలా కీలకమన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ, అలా చేస్తే సమస్యలు ముందుగానే బయటపడతాయనీ, తద్వారా సరైన చికిత్స పొంది, ఆరోగ్యంగా ఉండగలమని సింధు సూచించారు.
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏదో సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లడం కంటే.. ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు పీవి సింధు. అనారోగ్యం వచ్చినప్పుడు పరుగెత్తడం కంటే ముందస్తు వైద్య పరీక్షలకు తప్పకుండా వెళ్లాలనీ, పతకాల కోసం ప్రయత్నిస్తున్నా, డెడ్లైన్లు వెంటాడుతున్నా, లేదా ఫిట్గా ఉన్నా కూడా లైఫ్ డేంజర్ లో పడేంత వరకు ఆగద్దనీ, వైద్యపరీక్షలను ఒక అలవాటుగా చేసుకోండని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఇంట్లోనూ, ఆఫీసులోనూ తమ గురించి తక్కువగా ఆలోచిస్తారు. కానీ వార్షిక వైద్య పరీక్షలు లగ్జరీలు కావు, అవి అవసరాలు అని అన్నారు. అలాగే ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఎన్జీకే శాస్త్రి మాట్లాడుతూ సమస్యలను ముందుగానే గుర్తిస్తే, నివారణ చర్యలతో దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.
మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నోస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ రోగుల అవసరాలకు ఒక సమగ్ర పరిష్కారంగా నిలిచింది. ఇక్కడ 17 స్పెషాలిటీలలో ఓపీడీ కన్సల్టేషన్లు, సమగ్ర డయాగ్నోస్టిక్స్, డే కేర్ సర్జరీలు, నివారణ సంరక్షణ సేవలు అందిస్తోంది.