
కొంతమంది ఊరికే భయపడిపోతుంటారు. అలాగే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. వీటిని తగ్గించుకోవడానికి మందులతో పాటుగా ఎన్నో పద్దతులను పాటిస్తూ ఉంటారు. అయినా ఒత్తిడిని మాత్రం తగ్గించుకోలేకపోతుంటారు. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని ఆహారాలు సహజంగా ఒత్తిడిని తగ్గిస్తే.. ఇంకొన్ని మాత్రం ఒత్తిడిని కలిగిస్తాయి. క్లియర్ గా చెప్పాలంటే మీ ఆహారంలోని మార్పులే ఒత్తిడిని తగ్గించాలా? లేకా ఒత్తిడిని కలిగించాలో డిసైడ్ చేస్తాయి. నిజానికి కొన్ని రకాల ఆహారాలు మీ నాడీవ్యవస్థను అతిగా ప్రేరేపిస్తాయి. దీంతో మీరు ఒత్తిడికి గురవుతారు. అసలు ఒత్తిడి, ఆందోళనను కలిగించే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తీపిపదార్థాలు
చక్కెరతో చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే బరువు బరువు పెరగడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. తీపి పదార్థాలు ఒత్తిడిని కలిగిస్తాయి. కేకులు, పేస్ట్రీలు వంటి ఆహారాలు మీ రక్తంలో చక్కెరను పెంచుతాయి. అంతేకాదు మీ శక్తి కూడా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు మీలో ఒత్తిడి కలుగుతుంది.
కృత్రిమ స్వీటెనర్లు
చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను తీసుకోమని సలహానిస్తుంటారు. కానీ పలు అధ్యయనాలు ఎన్ఎన్ఎస్ (పోషకేతర స్వీటెనర్లు) వాడకం మన శరీరంలో మంట, ఒత్తిడిని పెంచుతుందని సూచిస్తున్నాయి. ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
కెఫిన్
కెఫిన్ మన శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మోతాదుకు మించి కెఫిన్ ను తీసుకుంటే మాత్రం మీ అడ్రినల్ గ్రంథులకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఇది మీ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. కెఫిన్ రక్తపోటును, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చివరికి ఇది ఒత్తిడి, ఆందోళనలకు దారితీస్తుంది.
శుద్ధి చేసిన పిండి పదార్థాలు
శుద్ధి చేసిన పిండి పదార్థాలు శరీరంలో మంటను పెంచుతాయి. అలాగే వీటిని తీసుకుంటే మీ శరీరంలో అవసరమైన దానికంటే చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎన్నో మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి పెరుగుతుంది.
వేయించిన ఆహారాలు
వేయించిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో మంట కలిగేందుకు ట్రాన్స్ ఫ్యాట్స్ యే ప్రధాన కారణం. మీ శరీరంలో మంట కలిగినప్పుడు మీలో ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి