ఇండియన్ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్ నెట్వర్క్. ఇండియాలో ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే చాలామంది రైళ్లలో వెళ్లడానికి ఇష్టపడతారు.
రైళ్లలో ప్రయాణించడానికి సాధారణంగా జనరల్, రిజర్వేషన్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోతుంది. అప్పుడు వెయిటింగ్ టికెట్ తోనే చాలామంది ప్రయాణం చేస్తుంటారు. అలా చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే?
టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే, రైల్వే మీకు సీటు కన్ఫర్మ్ చేయనట్టు లెక్క. వెయిటింగ్ లిస్ట్లో ఉండి రిజర్వ్ బోగీలో ప్రయాణిస్తే మాత్రం చిక్కుల్లో పడతారు. ఇండియన్ రైల్వే వెయిటింగ్ టికెట్లపై కొన్ని రూల్స్ పెట్టింది. వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
స్లీపర్ బోగీలో ఎక్కితే?
వెయిటింగ్ లిస్ట్ లో ఉండి స్లీపర్ బోగీలో ప్రయాణిస్తే రూ.250 ఫైన్ కట్టాలి. అంతేకాదు మీరు ఎక్కడ ఎక్కారో అక్కడ నుంచి టీసీ పట్టుకున్న వరకు ఛార్జ్ కూడా కట్టాలి. ఇంకా వెళ్లాలంటే అక్కడి నుంచి మీరు వెళ్లాల్సిన దూరం వరకు మళ్లీ ఛార్జ్ కట్టాలి.
ఏసీ బోగీలో కూర్చుంటే?
ఒకవేళ ఏసీ బోగీలో వెయిటింగ్ లిస్ట్తో ఎక్కితే రూ.440 ఫైన్, ఇంకా ఛార్జీ కట్టాలి. దూరాన్ని బట్టి ఛార్జీ మారుతుంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. డబ్బులు వాపస్ వస్తాయి.