
Bharat Bandh : కేంద్ర ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై వివిధ రంగాలకు చెందిన కార్మికులు గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను మోదీ సర్కార్ ప్రైవేటీకరిస్తూ ఉద్యోగులు, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే కార్మిక సంక్షేమాన్నిఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి కార్పోరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు(జులై 9, బుధవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు.
ఈ భారత్ బంద్ లో 10 కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి... బ్యాంకింగ్ తో పాటు భీమా, తపాలా, బొగ్గుగనులు, జాతీయ రహదారులు, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు ఈ బంద్ లో పాల్గొంటాయని ప్రకటించాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కార్మికులు, రైతులు కూడా ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ కోరుతున్నాయి.
భారత్ బంద్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు మూతపడే అవకాశాలున్నాయి. అయితే ఇది అధికారిక సెలవు కాదు... కానీ కార్మిక సంఘాలు ఆందోళనలో భాగంగా స్కూళ్లను మూయించవచ్చు. అలాగే ఆర్టిసి బస్సులను కూడా అడ్డుకునే అవకాశాలున్నాయి. దీంతో నిత్యం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడతారు. కాబట్టి కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే అవకాశాలున్నాయి.
భారత్ బంద్ లో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అంటే ఈ బంద్ ఆషామాషీగా కాదు ఉధృతంగానే సాగనుంది. కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టనున్నారు. కాబట్టి స్కూళ్లు, కాలేజీ బస్సులు కూడా నడవడం కష్టమే. ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకునే అవకాశాలున్నాయి. కాబట్టి విద్యార్థులకు స్కూల్ ఉన్నా వెళ్లడం కష్టం అవుతుంది.
అయితే బుధవారం భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్ల నిర్వహణ కష్టమని భావిస్తే విద్యాశాఖ అధికారులు, స్కూల్ యాజమాన్యాలు సెలవుపై నిర్ణయం తీసుకుంటాయి... మీడియా ద్వారా లేదంటే స్వయంగా పిల్లల పేరెంట్స్ కు సమాచారం ఇస్తారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అధికారిక నిర్ణయాలను మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దు.
భారత్ బంద్ లో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే అవకాశాలున్నాయి. అయితే ఈ బంద్ లో ఏఏ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటారో ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఏ బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం...అన్ని బ్యాంకింగ్ సేవలకు రేపు అంతరాయం ఏర్పడుతుంది, ఇక ఉద్యోగులు బంద్ లో పాల్గొనే బ్యాంకులు మూతపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు రేపు భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. విధులను బహిష్కరించి ఈ బంద్ కు మద్దతుగా రోడ్డెక్కనున్నారు. ఇలా తపాలా, ఇన్సూరెన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా బంద్ కు మద్దతు ప్రకటించారు... కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. అలాగే మైనింగ్, నిర్మాణరంగ సేవలు కూడా నిలిచిపోనున్నాయి.
జులై 9న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు కొన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్స్ ని బలహీనపర్చేలా తీసుకువస్తున్న కొత్త లేబర్ కోడ్ ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని... నష్టాల్లో నడిచే సంస్థలకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
కార్మికులకు పనిగంటలు పెంచకూడదని... వారి హక్కులను కాపాడాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలను ప్రోత్సహించకుండా శాశ్వత పద్దతిలో నియామకాలు చేపట్టాలని సూచిస్తున్నాయి. 10 సంవత్సరాలు వార్షిక కార్మిక సదస్సు నిర్వహించడంలేదని.. వెంటనే దాన్ని ఏర్పాటుచేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.