Published : Feb 11, 2026, 07:54 AM ISTUpdated : Feb 11, 2026, 08:06 AM IST
Weather update : ఇంకా చలికాలమే ముగియలేదు.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయో తెలుసా..?
Weather Update : శివరాత్రి వచ్చిందంటే చాలు చలి 'శివశివా' అనుకుంటూ వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రతిసారి సరిగ్గా ఇలాగే జరుగుతుంది.. శివరాత్రి తర్వాత చలి పూర్తిగా తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈసారి కూడా ఇదే జరగనుందని... మరో మూడు నాలుగు రోజుల్లో శీతాకాలం ముగిసినట్లేనని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
26
తెలంగాణ వాతావరణం ఎలా ఉటుందంటే... వెదర్ మ్యాన్ అంచనా
ప్రస్తుతం రాత్రి, ఉదయం వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి... దీంతో చలి కొనసాగుతోంది. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఎండ మండిపోతూ ఉక్కపోత ఉంటోంది. ఈ మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని...పగటిపూట 33 డిగ్రీలు ఉంటుందని హెచ్చరించారు. రాత్రి, ఉదయం వేళల్లో కూడా 16 నుండి 18 డిగ్రీలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
36
ఈ తెలంగాణ జిల్లాల్లో చలి..
రాబోయే రెండుమూడు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని...కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి 11 (బుధవారం) ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న (మంగళవారం) అత్యల్పంగా మెదక్ లో 13.2, ఆదిలాబాద్ లో 13.7, రామగుండంలో 14.2, హన్మకొండలో 15, నిజామాబాద్ లో 16,4, నల్గొండలో 17.4, మహబూబ్ నగర్ లో 17.8, ఖమ్మంలో 18.6, భద్రాచలంలో 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
56
హైదరాబాద్ వాతావరణ సమాచారం
హైదరాబాద్ విషయానికి వస్తే అత్యల్పంగా రాజేంద్రనగర్ లో 12, పటాన్ చెరులో 12.4, హయత్ నగర్ లో 15, బేగంపేటలో 16.5, హకీంపేటలో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. అత్యధికంగా హకీంపేటలో 31.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ (బుధవారం) హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో ఉంటుందని... అత్యధికంగా 32 డిగ్రీలు, అత్యల్పంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
66
ఏపీలో మండిపోతున్న ఎండలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు ముదురుతున్నాయి... మరో రెండుమూడు రోజుల్లో చలి పూర్తిగా తగ్గిపోతుందని వాతావరణ శాఖ చెబుతోంది. వేసవికాలం ఇలా మొదలయ్యిందో లేదో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి... నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నరసాపురం, బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతారణమే ఉంది... గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీన్నిబట్టి రాష్ట్రంలో ఎండల తీవ్రతను అర్థంచేసుకోవచ్చు... ఇప్పుడే ఇలా ఉంటే నడి వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడుతున్నారు.