నల్లమల కొండలు :
హైదరాబాద్ నుండి రెండుమూడు గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది నల్లమల ఫారెస్ట్. ఎత్తైన కొండలు, దట్టమైన అడవితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ అడవి. ప్రస్తుతం ఈ నల్లమల అడవిలోని లోయలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతర జరుగుతోంది. అంతెత్తు నుండి కిందకు జాలువారే జలపాతాన్ని చూస్తూ లోయలో ట్రెక్కింగ్ అద్భుత అనుభూతిని ఇస్తుంది.
ఏడాదిలో కేవలం మూడురోజులు మాత్రమే సలేశ్వరం లింగమయ్య ఆలయానికి భక్తులను అనుమతిస్తారు. ఏప్రిల్ 11 నుండి జాతర ప్రారంభమయ్యింది... ఏప్రిల్ 13తో అంటే ఇవాళ్టితో ఇది ముగుస్తుంది. వరుస సెలవుల నేపథ్యంలో నిన్నటినుండి ఈ జాతరకు భక్తుల పోటేత్తారు... దీంతో సలేశ్వరంకు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ సలేశ్వరం ఉంటుంది. దట్టమైన అడవిలో టైగర్ రిజర్వ్ లో కొంతదూరం వాహనం, మరికొంతదూరం కాలినడకన ప్రయాణం ఉంటుంది. 3 కిలోమీటర్లు కొండలు, గుట్టల నడుమ బండరాళ్లు, నీళ్ల మధ్య కాలినడకన ప్రయాణం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఇక సలేశ్వరం మాత్రమే కాదు ఈ నల్లమలలో అనేక సందర్శనీయ ప్రదేశాలున్నాయి. అడవిలో సహజ అందాలను ఆహ్వాదించడమే కాదు నాగార్జున సాగర్ లో బోటింగ్, ఘాట్ రోడ్డు ప్రయాణం, శ్రీశైలం ప్రాజెక్ట్ వ్యూ, అభయారణ్యం, ఉమామహేశ్వర ఆలయం ఉన్నాయి. నల్లమల కొండలపై ట్రెకింగ్ కూడా చేయవచ్చు. సహజ ప్రకృతి అందాలు గొప్ప అనుభూతిని అందిస్తాయి.