రామయ్యను వనజీవిగా ఎలా మారారు?
తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో వ్యవసాయ కుంటుంబంలో 1937లో జన్మించారు దరిపల్లి రామయ్య. ఆయన పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇలా చదువుకునే సమయంలోనే అతడిని మల్లేశం అనే ఉపాధ్యాయుడు చాలా ప్రభావితం చేసాడు. పర్యావరణాన్ని కాపాడేది చెట్లేనని... వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ మల్లేశం సార్ చెప్పిన మాటలు రామయ్య మనసులో నాటుకుపోయాయి. అప్పటినుండి చెట్లపై మక్కువ పెంచుకుని మొక్కలు నాటడం ప్రారంభించారు. ఇలా మొదలైన ఆయన మొక్కల పెంపకం చివరకు ఓ ఉద్యమంలా సాగింది.
ఓవైపు వ్యక్తిగత జీవితాన్ని, మరోవైపు తన మొక్కల పెంపకాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు రామయ్య. భార్య జానకమ్మ, నలుగు బిడ్డలకు ఏలోటు రాకుండా చూసుకుంటూ ప్రకృతి ప్రేమను చాటుకున్నాడు. అతడికి చెట్లంటే ఎంత ఇష్టమంటే తన మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లు పెట్టారు... హరిత లావణ్య, కబంధపుష్ఫ, చందన పుష్ప, వన శ్రీ అని.
మొదట్లో తన ఇంటిదగ్గర సొంతస్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు రామయ్య. ఆ తర్వాత మెళ్ళిగా ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ భూములు, రోడ్లపక్కన చెట్లు పెంచేవాడు. ఎండాకాలంలో అడవుల నుండి విత్తనాలు సేకరించి వానాకాలంలో చల్లేవాడు. ఇలా అతడు తన జీవితంలో కోటికి పైగా మొక్కలు నాటాడు... అవిప్పుడు మానవాళికి ఆహ్లాదరకమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
పేరుకోసమో, డబ్బుల కోసమే కాదు కేవలం ప్రకృతిని కాపాడాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నిస్వార్థంగా మొక్కల పెంపకాన్ని సాగించారు రామయ్య. తాను పెంచడమే కాదు అందరూ మొక్కలు పెంచాలంటూ 'వృక్షో రక్షతి రక్షిత:' అనే బోర్డులు తలకు పెట్టుకుని, మెడలో వేసుకుని ప్రచారం చేసేవారు. స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి వారినికూడా భాగస్వామ్యం చేసేవారు. ఇలా పర్యావరణాన్ని కాపాడేందుకు విశేషమైన కృషి చేశారు రామయ్య.