ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టేయండి.. జూన్ 28న ప్రతీ పేరెంట్ చేయాల్సిన పని ఇదే

Published : Jun 27, 2026, 09:01 PM IST

Pulse Polio: తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28, ఆదివారం 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో నిరోధక చుక్కలు వేయనున్నారు.  

PREV
14
జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లు

ఆదివారం (రేపు) జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ల వద్ద చిన్నారులకు రెండు చుక్కల టీకా వేయనున్నారు. అదే సమయంలో పోలియో బూత్‌కు రాలేకపోయిన పిల్లలు ఒక్కరూ మిగిలిపోకుండా జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వైద్య బృందాలు టీకాలు వేయనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ జనాభా అధికంగా ఉండటంతో అక్కడ జూలై 1న అదనపు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

24
40 లక్షలకుపైగా చిన్నారులకు టీకా.. భారీ ఏర్పాట్లు

ఈ ఏడాది నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 40.97 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీకా కార్యక్రమానికి అవసరమైన 52.04 లక్షల bOPV డోసులను అన్ని జిల్లాలకు ఇప్పటికే పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వేలాది మంది ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి పనిచేయనున్నారు.

34
ప్రత్యేకంగా ఈ ప్రాంతాల పిల్లలపై దృష్టి

పోలియో టీకా ఒక్క చిన్నారికీ మిస్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా వలస కార్మికుల కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, పట్టణ బస్తీలు, కొత్తగా ఏర్పడిన కాలనీలు, గిరిజన గ్రామాల్లో నివసించే పిల్లలను గుర్తించి వారికి తప్పనిసరిగా టీకా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, ఆర్టీసీతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా సమన్వయంతో పనిచేయనున్నాయి.

44
ఇప్పటికే టీకా వేయించినా మరోసారి ఎందుకు వేయాలి?

చాలా మంది తల్లిదండ్రుల్లో గతంలో పోలియో చుక్కలు వేయించాం కదా.. మళ్లీ ఎందుకు వేయించాలి అనే సందేహం ఉంటుంది. అయితే ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం వల్లే పిల్లలకు పూర్తి స్థాయి రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో చివరిసారిగా 2007లో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి రాష్ట్రం పోలియో రహితంగా కొనసాగుతోంది. ఈ హోదాను భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలంటే 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి జూన్ 28న తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలని వైద్యారోగ్య శాఖ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, సమాజాన్ని పోలియో రహితంగా ఉంచడంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories