Telangana municipal elections results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్తోన్న ట్రెండ్ చూస్తుంటే కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఓ మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం వచ్చింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు జిల్లాల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతుండగా, అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకపక్ష ఆధిక్యం కనిపిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పోటీ నెలకొంది.
25
నల్గొండలో కాంగ్రెస్ హవా
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి ప్రత్యర్థులకు అవకాశమే ఇవ్వలేదు. ఈ ఫలితం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఖమ్మం జిల్లా మధిరలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో తన ఖాతా తెరిచింది. 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. బీఆర్ఎస్కు చెందిన పెదపూడి సుధాకర్పై ఆమె ఆధిక్యం నమోదు చేశారు.
35
మంచిర్యాలలో సీపీఐ విజయం
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 7 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ 4 వార్డులు దక్కించుకోగా, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించింది. దీంతో దేవరకద్రలో పాలన కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. ఇక మంచిర్యాల జిల్లాలోని క్యాతపల్లి మున్సిపాలిటీలో సీపీఐ తన ఉనికి చాటుకుంది. 19వ వార్డులో సీపీఐ అభ్యర్థి మిట్టపల్లి సరిత శ్రీనివాస్ 456 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయం ఆ పార్టీకి ఉత్సాహాన్ని కలిగించింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏఐఎఫ్బీకి చెందిన సింహం గుర్తుపై కవిత మద్ధతుదారులు దాదాపు అన్ని స్థానాల నుంచి పోటీ చేశారు. కాగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ విజయాన్ని సాధించింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 8 స్థానాల్లో కవిత మద్ధతుదారులు విజయం సాధించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో ఇప్పుడీ విజయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
55
ఈ క్రెడిట్ ఎవరికి
కాగా వడ్డేపల్లి గెలుపు కవితకు చెందుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు కవిత చేపట్టిన ప్రచారం కలిసొచ్చిందని జాగృతి మద్ధతుదారులు అంటున్నారు. అయితే స్థానికంగా ఉన్న బలమైన నేత అందరినీ గెలిపించుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా కవిత మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టడం కొత్త చర్చకు తెర తీసింది.