
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్ గోల్. అందుకే, ఇల్లు కట్టుకునే పేద ప్రజల కలలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ ప్లాన్తో ముందుకు వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై అస్సలు భారం పడకుండా, మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే నిర్మాణ సామగ్రిని అందించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సిమెంట్, స్టీల్ కంపెనీలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు. అలాగే, అద్దె ఇళ్ల బాధలకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
ఇల్లు కట్టాలంటే సిమెంట్, స్టీల్ ఖర్చులే కొండంత అవుతాయి. అందుకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం బయట మార్కెట్లో సిమెంట్ బస్తా ధర దాదాపు రూ. 330 వరకు పలుకుతోంది. కానీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం కేవలం రూ. 220 కే ఒక్కో బస్తా అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
బల్క్ ఆర్డర్ ఇస్తాం కాబట్టి రేటు తగ్గించాలని కోరింది. అయితే కంపెనీలు రూ. 220 కి ఇస్తే నష్టాలొస్తాయని చెబుతూ, రూ. 270 వరకు ఇస్తామని ఆఫర్ చేశాయి. త్వరలోనే దీనిపై ఫైనల్ నిర్ణయం రానుంది. ఒక్కో ఇంటికి సుమారు 180 సిమెంట్ బస్తాలు, 15 క్వింటాళ్ల స్టీల్ అవసరమవుతాయి. ప్రభుత్వం అనుకున్నట్లు రూ. 220 లేదా రూ. 230 కే సిమెంట్ లభిస్తే, లబ్ధిదారులకు ఒక్కో ఇంటిపై వేలల్లో ఆదా అవుతుంది.
సాధారణంగా సిమెంట్, స్టీల్ కొంటే వాటిని ఇంటి వద్దకు తెచ్చుకోవడానికి రవాణా చార్జీలు తడిసి మోపెడవుతాయి. కానీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎలాంటి అదనపు రవాణా ఛార్జీలు లేకుండా నేరుగా సిమెంట్, స్టీల్ను డెలివరీ చేయాలని ప్రభుత్వం కంపెనీలకు స్పష్టం చేసింది. దీనివల్ల రవాణా టెన్షన్ అస్సలు ఉండదు. ఈ ప్లాన్ను సక్సెస్ చేయడానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే కంపెనీల ప్రతినిధులతో మీటింగ్స్ పెట్టారు. స్టీల్ ధరల తగ్గింపుపై కూడా రాయితీ చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ స్కీమ్ కేవలం పల్లెలకే పరిమితం కాదు.. హైదరాబాద్లో నివసించే అల్ప ఆదాయ వర్గాల కోసం ఏకంగా ఒక లక్ష ఇళ్లను దశలవారీగా నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి ఈ పథకాన్ని తీసుకొస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చేశారు. ఈ అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను జూలై 20 న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే వీటిని కంప్లీట్ చేయాలనేది టార్గెట్. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లను కడతారు. డిమాండ్, ల్యాండ్ అవైలబిలిటీని బట్టి ఈ సంఖ్యను 1,000 ఇళ్ల వరకు పెంచే ఛాన్స్ కూడా ఉంది.
గత ప్రభుత్వాల హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సిటీకి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో, ఎక్కడో శివార్లలో ఉండటం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అంత దూరం వెళ్తే ఉపాధి పోతుంది, పిల్లల స్కూళ్లు ఉండవు, హాస్పిటల్స్, బస్సులు కూడా దొరకవు. అందుకే ఈసారి రేవంత్ సర్కార్ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంది.
ప్రజలు ప్రస్తుతం ఎక్కడైతే బతుకుదెరువు సాగిస్తున్నారో, దానికి వీలైనంత దగ్గరలోనే ఇళ్లను కట్టాలని డిసైడ్ అయ్యింది. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని క్యూర్ (CURE) ఏరియాల్లో ప్రభుత్వ భూములను ఆల్రెడీ గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాక భవనాల ఎత్తు, అపార్ట్మెంట్ లేఅవుట్లు, ఫైనల్ డిజైన్లను ఓకే చేస్తారు.
జనాల్లో ఈ స్కీమ్ మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుసా? ఇటీవల జరిగిన ప్రజావాణి ప్రోగ్రామ్లో వచ్చిన 1,061 అప్లికేషన్లలో ఏకంగా 908 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయి. వారానికి దాదాపు 1,500 అప్లికేషన్లు వస్తుండటంతో, డౌట్స్ క్లియర్ చేయడానికి హెల్ప్ డెస్కులు కూడా పెట్టారు.
అసలు ఈ CURE (హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్) అంటే ఏంటంటే.. హైదరాబాద్ మెట్రో ఏరియాలో మౌలిక వసతులు, ట్రాఫిక్, మున్సిపల్ సర్వీసెస్, అలాగే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే ఒక అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్. దీని ద్వారా నగర పేదలకు సొంత ఇంటి కల నెరవేరడం పక్కా అని అధికారులు భరోసా ఇస్తున్నారు.