Telangana: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో రెండు రోజులుగా ఒక కారు ఉండడం, కారులోంచి దుర్వాస రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో ఒక కారు రెండు రోజులుగా పార్క్ చేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వాహనం నుంచి దుర్వాసన రావడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీ తెరిచి చూడగా అందులో మూటకట్టిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది.
24
మృతురాలు మానసగా గుర్తింపు
కారు రిజిస్ట్రేషన్ నంబర్ను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు సమాచారం. వాహనం మానసకు పరిచయమైన వినోద్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలు వినోద్ వైపు మళ్లాయి.
వినోద్ను అదుపులోకి తీసుకుని విచారణ
మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు వినోద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మానసతో తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి కరీంనగర్లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి నోటి నుంచి నురగలు రావడంతో ఆమె మృతి చెందినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
34
భయంతో మృతదేహాన్ని కారులో వదిలేశానని వెల్లడి
మానస మృతి చెందడంతో భయపడిపోయిన తాను మృతదేహాన్ని అక్కడే ఉంచకుండా కారులో తీసుకెళ్లి ఎల్కతుర్తి వద్ద వదిలి వెళ్లినట్లు వినోద్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వాంగ్మూలం నిజమేనా? ఘటనకు సంబంధించి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై ఎల్కతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస మృతి చెందిన పరిస్థితులు, ఆమె చివరిసారిగా ఎవరితో ఉంది, కారు ఎక్కడి నుంచి వచ్చింది, మృతదేహాన్ని ఎల్కతుర్తికి ఎందుకు తీసుకువచ్చారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వినోద్ చెప్పిన విషయాలను ఇతర ఆధారాలతో సరిపోల్చే పనిలో ఉన్నారు. మృతదేహానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్ వివరాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది.