Telangana: తెలంగాణలో కేవలం ఒకే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందన్న విషయం తెలిసిందే. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విమానాశ్రాయాలు తీసుకురావాలన్నా ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
తెలంగాణలో విమానయాన సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించగా, స్థానిక ప్రజాప్రతినిధులు దానిని విడుదల చేశారు. త్వరలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఆదిలాబాద్ జిల్లాలో ఆర్థిక, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో పెద్ద మార్పులు కనిపించే అవకాశముంది.
25
జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్గా అభివృద్ధి
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమాన సర్వీసులతో పాటు రక్షణ అవసరాలకు ఉపయోగించే జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్గా అభివృద్ధి చేయనున్నారు. భారత వాయుసేన సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వడంతో ప్రాజెక్ట్ ముందుకు కదులుతోంది. భవిష్యత్తులో ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. విమానాశ్రయం అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో టర్మినల్ భవనం, విమానాల పార్కింగ్ ప్రాంతం, నియంత్రణ టవర్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఆదిలాబాద్ ప్రాంతానికి నేరుగా విమాన సదుపాయం అందుబాటులోకి రానుంది.
35
పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు
విమానాశ్రయం ఏర్పాటుతో ఆదిలాబాద్ పారిశ్రామికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో భారీ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం వేల ఎకరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎయిర్ కనెక్టివిటీ పెరగడం వల్ల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. విమానాశ్రయం ద్వారా సరుకు రవాణా సులభమవడం వల్ల చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ వనరులు, ఖనిజ సంపద వంటి స్థానిక వనరులకు మార్కెట్ విస్తరించే అవకాశం ఉంటుంది.
విమానాశ్రయం నిర్మాణంతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిర్మాణ దశలోనే వందలాది మందికి పని దొరికే అవకాశం ఉంది. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత భద్రత, నిర్వహణ, సేవలు, రవాణా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా హోటళ్లు, ట్రావెల్ సేవలు, లాజిస్టిక్స్ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల ఆదిలాబాద్ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి పెరిగే అవకాశం ఉంది.
55
పెరగనున్న భూములు విలువ
విమానాశ్రయం ప్రాజెక్ట్ కారణంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విమానాశ్రయం పరిధిలో ఉన్న గ్రామాలు రియల్ ఎస్టేట్ దృష్టిలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల పెరుగుదలతో వేగంగా ఎదగనుంది. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు మెరుగుపడే అవకాశముంది.
ఆదిలాబాద్ ప్రాంతానికి దీర్ఘకాల ప్రయోజనాలు
విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ సహా ఇతర నగరాలకు ప్రయాణం సులభమవుతుంది. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయాణ సమయం తగ్గుతుంది. జిల్లా దేశంలోని ఇతర ప్రాంతాలతో త్వరగా కలుస్తుంది. దశాబ్దాలుగా ఉన్న విమానాశ్రయ అవసరం నెరవేరే దిశగా అడుగు పడింది. విమానాశ్రయం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రాంతీయ సమతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారే అవకాశముంది.