సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోయే రోజు... ఇదేరోజు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యింది. అంటే తెలంగాణలో నిజాం రాజుల పాలన ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమయ్యింది... కాబట్టి తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్య్రం ఈరోజే వచ్చిందన్నమాట. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.
సెప్టెంబర్ 17ను ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటుంది… బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఇంకొందరు తెలంగాణ విలీన దినోత్సవం అనేవారు. ఇక పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట కార్యక్రమాలు జరిపేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుతోంది.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది రేవంత్ సర్కార్. తెలంగాణవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జెండాను ఎగరవేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి.
అయితే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారిక సెలవేమీ ప్రకటించలేదు. అకడమిక్ క్యాలెండర్ లోనూ ఈ సెలవు గురించి ప్రస్తావన లేదు. కానీ గత అనుభవాలరిత్యా ఈరోజు సెలవు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి... ఇందుకు సంబంధించిన అధికారిక జీవో ఎప్పుడైనా వెలువడవచ్చు. ఈరోజు జెండా ఆవిష్కరణ తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయేలా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.