Rain Alert: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం. అల్లకల్లోలం ఖాయం

Published : Jun 03, 2026, 04:42 PM IST

Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

PREV
15
18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ వర్ష సూచనలు ఉండటంతో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.

25
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించాలని కోరుతున్నారు.

35
ఖమ్మం, కొత్తగూడెంలో ఇప్పటికే భారీ వర్షాలు

మంగళవారం రాత్రి నుంచే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడ ప్రాంతంలో 6 సెంటీమీటర్లు, అశ్వారావుపేటలో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వర్షాల ప్రభావంతో చెరువులు, వాగులు నీటితో నిండుతున్నాయి.

45
ముందుగానే రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను తాకే దశలో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం దక్షిణ భారత రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

55
ప్రజలకు, రైతులకు కీలక సూచనలు

భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిది. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి. రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories