
Hyderabad : మహిళల్లో చాలామంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుంటారు. ఇది నేటితరం మహిళల్లో మరీ కామన్ అయిపోయింది... దేశంలోని మొత్తం క్యాన్సర్ కేసుల్లో 28 శాతానికి పైగా మహిళలు దీంతోనే బాధపడుతున్నారని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ చెబుతోంది. మరీముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లో ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ క్రమంలో ఈ రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్, బైక్ ఓ హోలిక్స్ (Bike O Holics) కలిసి రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం సైక్లథాన్ చేపట్టారు. 'పెడల్ ఫర్ పింక్ 2025' పేరిట నిర్వహించిన సైక్లథాన్ లో దాదాపు 300 మందికిపైగా పాల్గొన్నారు. కేవలం సైక్లింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదు నగరంలోని కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు, స్థానికులు ఈ బ్రెస్ట్ క్యానర్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సైక్లథాన్ ర్యాలీ హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ మీదుగా సాగింది. లింగంపల్లి నల్లగండ్లలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుండి ప్రారంభమైన సైక్లథాన్ విప్రో సర్కిల్ వరకు కొనసాగింది... అక్కడినుండి తిరిగి హాస్పిటల్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి, ధాస్యం గీతా భాస్కర్, మాదాపూర్ డివిజన్ డిప్యూటీ కమీషనర్ రితి రాజ్ పాల్గొన్నారు. వీరుకూడా స్వయంగా సైకిల్ నడపడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది.
మారుతున్న జీవనశైలి ఈ రొమ్ము క్యాన్సర్ కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అహార అలవాట్లతో పాటు శరీరపరంగా మహిళల్లో చోటుచేసుకునే మార్పులవల్ల ఇది వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుందట... అలాగే మద్యపానం అలవాటున్న మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆలస్యంగా ప్రసవం, త్వరగా రుతుస్రావం, ఆలస్యంగా మెనోపాజ్ కావడం కూడా రొమ్ము క్యాన్సర్ కు కారణాలేనట.
ఇక పట్టణాల్లోని బిజీ లైఫ్ స్టైల్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు పుట్టాక తల్లి పాలు ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ క్యానర్స్ బారినపడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇలాంటి అనేక కారణాల వల్ల పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్నట్లు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అధ్యయనం చెబుతోంది.
రొమ్ము క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు ముందస్తు స్క్రీనింగ్ ఉత్తమ మార్గమని మెడికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కె.వి. కృష్ణమణి తెలిపారు. నిరంతర వ్యాయామం, సమతుల్య ఆహారం, మామోగ్రఫీ ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు. సకాలంలో ఈ క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా సమర్ధవంతంగా చికిత్స అందించవచ్చని అంటున్నారు.
రొమ్ము క్యాన్సర్స్ ను ముందుగానే గుర్తించేందుకు AOI మూడు వేర్వేరు స్క్రీనింగ్ ప్యాకేజీలను ప్రారంభించింది. కాబట్టి నడివయస్సుకు చేరిన మహిళలు అంటే 40 ఏళ్లు పైబడిన మహిళలు తరచూ ఆరోగ్య పరీక్షలు, మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంతో పాటు దాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలియజేసేందుకే నగరంలో సైక్లథాన్ ర్యాలీ చేపట్టినట్లు AOI వెల్లడించింది.