KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార వ్యూహంపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, బీఆర్ఎస్ గత పదేళ్ల అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం, వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు, దిశానిర్దేశం చేశారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక అనంతరం లంచ్ తర్వాత మీటింగ్ ప్రారంభమైంది.
25
పార్టీ నేతలకు సూచనలు
ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, వారి వైఫల్యాలను, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వివరించాలని స్పష్టం చేశారు. ఉదయం, సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాలను తెలియజేయాలని ఆదేశించారు.
35
ఉపఎన్నిక అనివార్యం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన సతీమణి మాగంటి సునీతకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. టికెట్ కేటాయింపు తర్వాత ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేత పార్టీ గెలుపునకు కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీకి అనుకూలంగా అన్ని సర్వేలు ఉన్నాయని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇందుకోసం క్లస్టర్ల వారీగా, డివిజన్ల వారీగా ఇంఛార్జ్లను నియమించి ప్రచారం కొనసాగించాలని సూచించారు. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే దానిపై షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
55
బీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడక.?
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడక అని, జూబ్లీహిల్స్ ఓటర్లు గతంలోనూ బీఆర్ఎస్ను ఆదరించారని, ఈసారి కూడా పట్టం కడతారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని, ఈ ఉపఎన్నికను ఏ పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని కేసీఆర్ నేతలకు నిర్దేశించారు. సమావేశం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లి ఫామ్హౌస్ నుండి హైదరాబాద్కు తిరిగి వెళ్లారు.