High Alert in Telangana
Telangana : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి దాడులు ఎక్కడా జరక్కుండా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి... కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలను హెచ్చరించారు. ఇలా తెలంగాణలో కూడా హైఅలర్ట్ ప్రకటించారు.
High Alert in Hyderabad
హైదరాబాద్ లో అలర్ట్ :
గతంలో హైదరాబాద్ ఉగ్రదాడులకు గురయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పోలీసులను నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగర భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేపనిలో పడ్డారు... ఇందుకోసం తనిఖీలను ముమ్మరం చేసారు.
హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లోనూ తనిఖీలు పెంచారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీచేసారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు.
High Alert in Tirumala
తిరుమలలో భద్రత పెంపు :
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆద్యాత్మిక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇలా దేశంలోనే అత్యంత ధనిక ఆలయం, నిత్యం లక్షలాదిమంది భక్తులతో కిటకిటలాడే తిరుమల దేవాలయంలో కూడా భద్రతను పెంచారు. తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలను మరింత క్షుణ్ణంగా పరిశీలీస్తున్నారు. తిరుమలలో అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు.
అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రత కట్టుదిట్టం చేసారు. అలిపిరి టోల్ గేట్, ఘాట్ రోడ్డులో వాహనాల తనిఖీలు ముమ్మరం చేసారు. ఆలయ పరిసరాల్లో ఆక్టోపస్, టిటిడి భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రత కోసం తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించాయి ఆక్టోపస్ బలగాలు. ఇలా తిరుమల చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటుచేసారు.
Pahalgam Terror Attack
పహల్గాం ఉగ్రదాడిపై హైదరాబాద్ ముస్లింల నిరసన... ఓవైసి పిలుపు
కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా చంపడాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. కేవలం హిందువులనే టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిపై హిందుత్వ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముస్లింలు కూడా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ హిందువులకు మద్దతుగా నిలవాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి పిలుపునిచ్చారు. రేపు శుక్రవారం నమాజ్ కు ముస్లింలంతా నల్లరిబ్బన్లు ధరించి హాజరవ్వాలని ఓవైసి సూచించారు. దీంతో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలే కాదు ముస్లింలు శుక్రవారం నల్లరిబ్బన్లతో మసీదుల్లో ప్రార్థనలు చేయనున్నారు.