MMTS: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే మూడు కొత్త స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చింది.
అల్వాల్లో లయోలా కాలేజీ సమీపం, ఆనంద్బాగ్, మౌలాలీ క్వార్టర్స్ ప్రాంతాల్లో మూడు కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వే బోర్డుకు పంపించారు. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
25
ఘట్కేసర్ – సనత్నగర్ మార్గానికి ప్రాధాన్యం
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి సనత్నగర్ వరకు రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో కొత్త స్టేషన్ల అవసరం స్పష్టమైంది. గతంలోనే ఈ రూట్లో మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటికి మళ్లీ వేగం వచ్చింది.
35
ప్రయాణికుల సమస్యలకు పరిష్కారం
చర్లపల్లి నుంచి నేరేడ్మెట్ వరకు మధ్యలో స్టేషన్లు లేకపోవడం వల్ల మల్కాజిగిరి పరిసరాల ప్రజలు చాలా దూరం ప్రయాణించి రైలు ఎక్కాల్సి వస్తోంది. ఆనంద్బాగ్లో స్టేషన్ ఏర్పడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే లయోలా కాలేజీ ప్రాంతంలో స్టేషన్ వస్తే విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉంటుంది.
మౌలాలీ రైల్వే క్వార్టర్స్ పరిసరాల్లో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ స్టేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు నగరంలోని ఇతర ప్రాంతాలకు నేరుగా చేరుకునే అవకాశం కలుగుతుంది.
55
ట్రాఫిక్ తగ్గింపే లక్ష్యం
తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంఎంటీఎస్ విస్తరణకు మద్ధతు ఇస్తోంది. రెండో దశ పనులకు నిధులు విడుదల చేసి ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, శివారు ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి.