తెలంగాణలో వర్షాలే వర్షాలు..
ఇప్పటికే తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి... మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం మండుటెండలు, సాయంత్రం వర్షాలు... ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 22, బుధవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇక ఈ రెండ్రోజులు (ఏప్రిల్ 22, 23) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుముల మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు ఈ వర్షాలకు తోడయి కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.