IMD Rain Alert: బంగాళఖాతంలో అల్పపీడనంతో పాటు ద్రోణీ.. ఇటు వర్షాలు, అటు చలి. జాగ్రత్త సుమీ..

Published : Nov 09, 2025, 06:39 AM IST

IMD Rain Alert: మొన్న‌టి వ‌ర్షాల‌తో ఇబ్బందులు ప‌డ్డ తెలుగు ప్ర‌జ‌లు ఇప్పుడు చ‌లికి సిద్ధం కావాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. వ‌చ్చే మూడు రోజులు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వాతావరణ మార్పులు

మొంథా తుఫాన్ ప్రభావం తగ్గినా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మార్పు దిశగా సాగుతోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా, దిగువ ట్రోపోస్థాయిలో ఉత్తర–ఈశాన్య గాలులు వీస్తుండటంతో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది.

25
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల అవకాశం

వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో శనివారం నుంచి సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా & యానాం: జల్లులు, మోస్తరు వర్షాలు రెండు రోజుల పాటు నమోదయ్యే అవకాశం.

దక్షిణ కోస్తా: మధ్యాహ్నం నుంచి రాత్రివేళ వరకు కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు.

రాయలసీమ: తేలికపాటి వర్షాలు, చల్లని గాలులు కొనసాగుతాయని IMD తెలిపింది.

వీటి ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గి, రాత్రిపూట చలి మరింత పెరగవచ్చని అంచనా.

35
తెలంగాణలో చలి పంజా

తెలంగాణ రాష్ట్రంలో వర్షాల దశ ముగిసిపోయి చలి మొదలైంది. రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుండి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నవంబర్ 10 తర్వాత చలి మరింతగా పెరుగుతుందని IMD హెచ్చరించింది. అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడే అవకాశం ఉందని తెలిపింది.

45
బంగాళాఖాతం ప్రభావం

ప్రస్తుతం బంగాళాఖాతం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. దీంతో పగటిపూట ఎండ కొనసాగుతుండగా, రాత్రివేళల్లో చలి పెరుగుతోంది. ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో చలి ఒక్కసారిగా పెరగడంతో, ఆ ప్రభావం కోస్తా ప్రాంతాలపై కూడా పడుతోంది. ఇక ఈ నెల రెండో వారం తర్వాత బంగాళాఖాతం లోతట్టు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

55
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు ధరించాలి.

శరీరాన్ని వేడి ఉంచేందుకు గోరువెచ్చని నీరు, సూప్‌లు, పోషకాహారం తీసుకోవాలి.

వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర ప‌రిస్థితుల్లో త‌ప్ప‌, రాత్రి బయటకు వెళ్లకూడదు.

చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్‌లు వాడాలి.

రైతులు పంటలను చలిగాలుల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాలి.

వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం, రానున్న రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories