రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా

Published : Mar 07, 2026, 05:18 PM IST

Hyderabad: హైద‌రాబాద్ శివారుల్లో భూముల ధరలు వేగంగా పెరుగుతున్న కొద్దీ భూ మోసాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చనిపోయిన మహిళ పేరుతో నకిలీ డాక్యుమెంట్లతో చేసిన ఓ భారీ భూ దందా వెలుగులోకి వ‌చ్చింది. 

PREV
15
అమీన్‌పూర్‌లో భారీ భూ కుంభ‌కోణం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, బీరంగూడ ప్రాంతాలు హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. కొల్లూరు, తెల్లాపూర్, అమీన్‌పూర్, బీరంగూడ, ఆర్సీపురం వంటి ప్రాంతాల్లో ప్ర‌స్తుతం గ‌జం ధ‌ర రూ. ల‌క్ష‌ల్లో ప‌లుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు మోసగాళ్లు నకిలీ పత్రాలతో కోట్ల రూపాయల భూములను విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి మోసమే తాజాగా బీరంగూడలోని మల్లికార్జున్ నగర్ కాలనీలో బయటపడింది. ఒక ముఠా చనిపోయిన మహిళ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి 800 గజాల స్థలాన్ని విక్రయించింది. ఈ వ్యవహారంలో రూ.2.5 కోట్లు చేతులు మారినట్లు స‌మాచారం.

25
ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తికి భారీ షాక్

హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 2024 జూన్‌లో బీరంగూడలోని సర్వే నెంబర్ 967లో ఉన్న మల్లికార్జున్ నగర్ కాలనీలో 324, 325 ప్లాట్ నంబర్లతో ఉన్న 800 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ స్థలాన్ని జీడిమెట్లకు చెందిన కాసుల కృష్ణ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేశారు. సంగారెడ్డి జిల్లా కంది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. స్థలం కొనుగోలు చేసిన తర్వాత శ్రీనివాస్ భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని పనులు ప్రారంభించాడు. బోరు వేయించి నిర్మాణ పనులు మొదలుపెట్టిన సమయంలో అనూహ్యంగా పోలీసులు అక్కడికి చేరుకుని పనులు నిలిపివేయాలని చెప్పారు. ఫోర్జరీ పత్రాలతో స్థలం కొనుగోలు చేశారని నోటీసులు ఇవ్వడంతో శ్రీనివాస్ షాక్‌కు గురయ్యాడు.

35
మోసం ఎలా జరిగిందంటే…

బీరంగూడ మల్లికార్జున్ నగర్ ప్రాంతంలో ఉన్న 800 గజాల స్థలాన్ని భాగ్యనగర్ కాలనీకి చెందిన ఉన్నం అచ్చమ్మ అనే మహిళ 2006లో కొనుగోలు చేసింది. ఆమె 2012 ఏప్రిల్ 6న మరణించింది. ఈ విషయం తెలుసుకున్న జీడిమెట్లకు చెందిన ఉన్నం శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి మోసానికి పథకం రచించాడు. తన ఇంటి పేరు కూడా “ఉన్నం” కావడంతో దాన్ని అవకాశంగా తీసుకుని తాను అచ్చమ్మ కుమారుడినని చెప్పుకుంటూ నకిలీ పత్రాలు తయారు చేశాడు. నకిలీ వారసత్వ ధ్రువపత్రం, తప్పుడు మరణ ధ్రువపత్రం తయారు చేసి ఆ స్థలాన్ని 2019లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. తర్వాత దామోదర్ రెడ్డి ఆ ప్లాట్లను అమ్మాలని బ్రోకర్లకు చెప్పడంతో వారు కొనుగోలుదారులను వెతికారు. చివరకు కూకట్‌పల్లి శ్రీనివాస్‌కు ఈ ప్లాట్లు రూ.2.5 కోట్లకు విక్ర‌యించారు.

45
అసలు వారసులు రంగంలోకి రావడంతో

కొంతకాలం తర్వాత ఉన్నం అచ్చమ్మ అసలు కుమారులు ఉన్నం వెంకటేశ్వర్లు, పార్థసారథిలకు ఈ విషయం తెలిసింది. తమ తల్లి స్థలం అక్రమంగా అమ్మార‌ని గుర్తించిన వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ భూమిపై ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పోలీసులు వెళ్లి పనులు ఆపివేశారు. దీంతో ఈ మొత్తం భూ మోసం బయటపడింది.

55
నకిలీ డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులతో మోసం

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అచ్చమ్మ పేరుతో ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ నుంచి నకిలీ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు గుర్తించారు. అయితే ఆ డెత్ సర్టిఫికెట్ పూర్తిగా నకిలీదని ఇస్నాపూర్ మునిసిపాలిటీ కమిషనర్ రాతపూర్వకంగా వెల్లడించారు. అదే కాకుండా కోర్టు ద్వారా పొందినట్లు చూపించిన వారసత్వ ధ్రువపత్రం కూడా నకిలీదే అని తేలింది. మోసగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించారు. ఈ ముఠా ఇదే పద్ధతిలో మల్లికార్జున్ నగర్ కాలనీలో మరో 7,200 గజాల స్థలాన్ని కూడా అక్రమంగా విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులపై విమర్శలు, బాధితుడి ఆవేదన

ఈ వ్యవహారంలో మోసపోయిన శ్రీనివాస్ ఇప్పటికే నాలుగు నెలల క్రితం అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేసు నమోదై నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ మోసంలో కొందరు అధికారుల సహకారం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories