Hyderabad : ఇక్కడ పాలతో స్మూత్ పూరీ, మిల్ మేకర్లతో స్పైసీ కర్రీ ఇస్తారు.. టేస్ట్ ఉంటుంది భయ్యా..!

Published : May 06, 2026, 03:45 PM IST

హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చే ఫుడ్... ఇక్కడి బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. అయితే నిజాంలు పాలించిన ఈ నగరంలో బిర్యానీయే కాదు ఇంకా అనేక మాంసాహార, శాఖాహార వంటకాలు ఫేమస్. అలాంటిదే ఈ మియాపూర్ ఫేమర్ పూరీ.

PREV
15
మియాపూర్ ఫేమస్ పూరీ..

Hyderabad : మియాపూర్ అంటే ఐటీ ఉద్యోగుల నివాసస్థలం, ట్రాఫిక్ రద్దీ మాత్రమే కాదు.. భోజన ప్రియులకి అదొక అద్భుతమైన రుచుల అడ్డా కూడా. ముఖ్యంగా ఉదయం పూట టిఫిన్ చేద్దామంటే మియాపూర్ పరిసరాల్లో ఎవరిని అడిగినా చెప్పే పేరు "మియాపూర్ ఫేమస్ పూరీ". కేవలం రుచి మాత్రమే కాదు, మూడు దశాబ్దాల నమ్మకం, నాణ్యత ఈ హోటల్ సొంతం.

25
ఈ పూరీకి 30 ఏళ్ళ చరిత్ర...

సుమారు 30 ఏళ్ల క్రితం చాలా నిరాడంబరంగా ప్రారంభమైన ఈ పూరీ సెంటర్ నేడు ఒక బ్రాండ్‌గా ఎదిగింది. అప్పట్లో కేవలం 5 రూపాయలకే ప్లేట్ పూరీ అందించేవారు. కాలక్రమేణా ధరలు మారినా, వారు ఇచ్చే క్వాలిటీ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ప్రస్తుతం 40 రూపాయలకే నాలుగు పూరీలను అందిస్తూ సామాన్యుల ఆకలి తీరుస్తున్నారు.

ఈ వ్యాపారం వెనుక ఉన్న అసలు బలం ఐదుగురు అన్నదమ్ములు. కుటుంబం అంతా కలిసి ఈ వృత్తినే దైవంగా భావించి, కష్టపడి పని చేయడం వల్లే ఈ స్థాయిలో విజయం సాధించారు. ప్రస్తుతం మియాపూర్‌లో రెండు చోట్ల తమ సేవలను అందిస్తున్నారు.

35
నాణ్యతలో రాజీ పడని తయారీ..

మియాపూర్ టిఫిన్ సెంటర్ లో పూరీ ఎందుకు అంత స్మూత్‌గా ఉంటుందనే దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. వీరు బయట దొరికే పిండిని కాకుండా ప్రత్యేకంగా మిల్లులో పట్టించిన పూరీ, చపాతీ పిండిని వాడతారు. ఈ పిండిలో కొద్దిగా పాలు కలుపుతారు.. దీనివల్ల పూరీ మెత్తగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యంగా వీరు వాడే నూనె (Oil) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పూరీ వేయించడానికి నాణ్యమైన ఆల్ఫా ఆయిల్ (Alpha Oil) వాడుతారు. అలాగే కూర్మా తయారీకి సన్ ఫ్లవర్ ఆయిల్ ఉపయోగిస్తారు.

45
కర్రీలో 'పాల' రుచి.. కట్టెల పొయ్యి ఘుమఘుమలు..!

ఈ పూరీ సెంటర్ ప్రత్యేకత ఇక్కడ ఇచ్చే కూర (Curry). సాధారణంగా హోటల్స్‌లో చేసే కర్రీలా కాకుండా, ఇందులో పప్పు, మిల్ మేకర్ తో పాటు కొంచెం పాలు కలిపి వండుతారు. దీనివల్ల కూరకి ఒక రకమైన రిచ్ టేస్ట్ వస్తుంది. ఈ కూర కోసమే కిలోమీటర్ల దూరం నుండి జనం వస్తుంటారు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే నేటి ఆధునిక కాలంలో కూడా వీరు కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు. కట్టెల పొయ్యి సెగ మీద ఉడికే ఆ రుచికి గ్యాస్ స్టవ్ రుచి సాటిరాదు కదా! అందుకే ఆ ప్రత్యేకమైన 'స్మోకీ ఫ్లేవర్' ఇక్కడి పూరీలకు అదనపు ఆకర్షణ.

55
వేలల్లో అమ్మకాలు.. లక్షల్లో అభిమానులు

మియాపూర్ ఫేమస్ పూరీ సెంటర్ లో క్రేజ్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలే సాక్ష్యం...

పిండి వినియోగం: ప్రతిరోజూ దాదాపు 60 నుండి 70 కిలోల పిండి వాడతారు.

సాధారణ రోజుల్లో: రోజుకు 5 నుండి 6 వేల పూరీలు అమ్ముడవుతాయి.

వారాంతాల్లో (శని, ఆదివారాలు) : రద్దీ విపరీతంగా ఉంటుంది, దాదాపు 8 నుండి 10 వేల పూరీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.

వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, తరం మారినా అదే నాణ్యతను, రుచిని కాపాడుకోవాలని ఈ మియాపూర్ ఫేమస్ పూరీ సెంటర్ నిర్వహకులైన  నిరూపిస్తున్నారు. మీరు గనుక మియాపూర్ వైపు వెళ్తే, ఆ కట్టెల పొయ్యిపై కాలిన వేడి వేడి పూరీని, ఆ ప్రత్యేకమైన పాలతో చేసిన కర్రీతో తిని చూడండి. ఆ రుచి మీ జీవితాంతం గుర్తుండిపోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories