
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విగ్రహాల రగడ తీవ్ర దుమారం రేపుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో రాత్రి వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొలగించారు. ఈ క్రమంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏకంగా 1,500 మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది.
రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల పరిసరాలు, పాకాల రోడ్డు వైపు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. విగ్రహ తొలగింపు ప్రక్రియను అత్యంత గోప్యంగా నిర్వహించారు. విగ్రహంతో పాటు దాన్ని ప్రతిష్ఠించిన సిమెంటు గద్దెను కూడా కూల్చివేసి, ఆ వ్యర్థాలను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఈ ఆపరేషన్ ఎంత సీక్రెట్గా జరిగిందంటే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని సైతం సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని ఉన్నతాధికారులు కఠిన ఆంక్షలు విధించారని సమాచారం. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను దారిలోనే అడ్డుకున్నారు.
“నన్నపునేని నరేందర్ గారి నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
పెద్ద ఎత్తున వారి నివాసానికి చేరుకున్నానియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు ”
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం తొలగింపు నన్నపునేని నరేందర్ గారి హౌస్ అరెస్ట్@BRSparty @KTRBRS pic.twitter.com/HL5HpwHQ6m— Nannapuneni Narender (@BRSNarenderWGL) August 18, 2026
విగ్రహ తొలగింపు వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సంపేటకు తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో కీలక బీఆర్ఎస్ నేతలను ఇళ్లలోనే అదుపులోకి తీసుకున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద సుమారు 400 మంది పోలీసులతో పహారా కాశారు. కాగా, నల్లబెల్లిలోని స్వగృహంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ముందు ఆయన సతీమణి పెద్ది స్వప్న భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు.
జులై 31న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఆయన దశ దిన కర్మ సందర్భంగా నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట ప్రైవేటు స్థలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన విగ్రహాన్ని పెట్టాయి. అయితే మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, పైగా అది అసైన్డ్ భూమి అని చెబుతూ అధికారులు విగ్రహం గద్దెను కూల్చివేయడంతో వివాదం మొదలైంది. అనుమతులు లేకుండా ఎలా కూలుస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేసి, అదే రోజు సాయంత్రం మళ్లీ కట్టారు. దాంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
నన్నపునేని నరేందర్ గారి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నరేందర్ గారికి సంఘీభావంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. @BRSparty pic.twitter.com/hNGqeAR9S4
— Nannapuneni Narender (@BRSNarenderWGL) August 18, 2026
వారం రోజులుగా అక్కడ పోలీసుల షిఫ్టుల వారీగా పహారా కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ముగిసిన వెంటనే, ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఈ విగ్రహాన్ని తొలగించినట్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు విగ్రహం తొలగింపుతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుండగా, మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తుండటంతో నర్సంపేటలో రాజకీయం మరింత వేడెక్కింది. ముందస్తు జాగ్రత్తగా పీఎస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కాంగ్రెస్ నేతల నివాసాల వద్ద బలగాలను మోహరించారు.
చనిపోయిన కూడా వేధింపులు ఆపని కాంగ్రెస్ ప్రభుత్వం... ప్రయివేట్ ల్యాండ్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం పెడితే ఎందుకు కూల్చి వేశారు మీకు వచ్చిన నొప్పి ఏందీ. @KTRBRS @PSRNSPT @peddi_swapna @SantoshKumarBRS @sravandasoju @EDRBRS @dasyamofficial @BRSNarenderWGL @PSReddyTRS pic.twitter.com/WMd7xl3qc1
— GARREPALLI SATHISH (@garapallysatish) August 18, 2026