Weather Updates : ఎండాకాలంలో ఈ వర్షాలేంట్రా బాబు..! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల అభిప్రాయమిదే. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాబోయే రోజుల్లోనూ వర్ష బీభత్సం తప్పేలా లేదు.
Weather Updates : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. చలికాలంలోనూ వర్షాలు కురిశాయి.. ఇప్పుడు వేసవిలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మరికొద్దిరోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో కొన్నిచోట్ల మండుటెండలు కూడా కొనసాగుతున్నాయి. ఇలా ఎండావానలతో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
25
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలతో పాటు వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) సాయంత్రం రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలుంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.
35
ఏపీకి పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం...
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం పొంచివుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అలాగే గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షాలు కురిసే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలతో పాటు ఎండలు కూడా మండిపోతున్నాయి. రాష్ట్రంలో రానున్న రెండురోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని... కొన్నిచోట్ల 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరించింది. రేపు (ఏప్రిల్ 04, శనివారం) 54 మండలాల్లో తీవ్రవడగాలులు,16 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎల్లుండి (ఏప్రిల్ 05, ఆదివారం) 41 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
55
తెలంగాణలో వర్షాలు...
తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతాయని... రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. (ఏప్రిల్ 03, 04 శుక్ర, శనివారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో ఎండల తీవ్రత కూడా ఉంటుంది.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.