
Ramzan: తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో ఉద్యోగుల పనిగంటలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2 నుండి 2025 మార్చి 31 వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, బోర్డు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వర్తిస్తుంది.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసం కోసం రాష్ట్రంలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పింది. ముస్లిం ఉద్యోగుల పని గంటలను తగ్గించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్-సోర్సింగ్, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు పవిత్ర రంజాన్ మాసంలో అంటే మార్చి 2 నుండి మార్చి 31 వరకు సాయంత్రం 4.00 గంటల వరకే పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేసింది.
రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ఉపవాస దీక్షలు ఉంటారు. ఈ క్రమంలోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ కార్యాలయాలు/పాఠశాలల నుండి 4 గంటలకు బయటకు వెళ్లి అవసరమైన ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. పైన పేర్కొన్న కాలంలో సేవల అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం ఈ నియాలు వర్తించవని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
"రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులు/ఉపాధ్యాయులు/కాంట్రాక్ట్/ఔట్-సోర్సింగ్/బోర్డులు/కార్పొరేషన్లు & ప్రభుత్వ రంగ ఉద్యోగులు పవిత్రమైన "రంజాన్" మాసంలో అంటే మార్చి 02 నుండి మార్చి 31 వరకు సాయంత్రం 4.00 గంటలకు తమ కార్యాలయాలు/పాఠశాలల నుండి బయటకు వెళ్లి అవసరమైన ప్రార్థనలు చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ సమయంలో సేవల అత్యవసర పరిస్థితుల ఉంటే వర్తించవు అని ప్రభుత్వ ఉత్తర్వులు" పేర్కొన్నాయి.
కాంగ్రెస్ బుజ్జగింపు పాలన అంటూ బీజేపీ ఫైర్
రంజాన్ మాసంలో ముస్లింలకు పనిగంటలు తగ్గింపును ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. రేవంత్ సర్కారు చర్యలను రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి తీసుకున్న బుజ్జగింపు చర్యగా పేర్కొంటూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.
హిందువుల పండగలకు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోరంటూ బీజేపీ ప్రశ్నించింది. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు హిందువులకు ఇలాంటి పనిగంటల తగ్గింపులు ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తోంది. మత విశ్వాసాల పట్ల సున్నితంగా ఉండటం మరిచి వారిని కేవలం ఓటు బ్యాంకుగా తగ్గించడం చేస్తోందని పేర్కొంది.
ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా అన్నారు. అలాగే, మరో సీనియర్ బీజేపీ నాయకుడు పి మురళీధర్ రావు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన సమాజంలోని ఒక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించుకున్నారంటూ ఫైర్ అయ్యారు.
హిందువులకు ఎందుకు ఇవ్వరు?
"తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బహిరంగ బుజ్జగింపు చర్యలకు పాల్పడుతోంది, రంజాన్ సమయంలో ముస్లిం ఉద్యోగులకు పనిగంటలను తగ్గించింది. నవరాత్రి సమయంలో హిందువులకు లేదా పర్యూషణ్ సమయంలో జైనులకు అలాంటి రాయితీలు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇది మతపరమైన ఆచారాల పట్ల గౌరవం గురించి కాదు - ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించిన అంశం. ఇది ఎలాంటి లౌకికవాదం? ఇతరులను విస్మరిస్తూ ఒక వర్గానికి ప్రత్యేక హక్కులు! తెలంగాణను షరియా తరహా పాలన మార్గంలోకి నెట్టివేస్తూ ఒక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలన కొనసాగిస్తే, ఈ పక్షపాతం మరింత తీవ్రమవుతుంది" అని మురళీధర్ రావు అన్నారు.
ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. “ఉగాది, ఇతర హిందూ పండుగల సందర్భంగా హిందువులకు ఇలాంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని నేను సీఎం రేవంత్ రెడ్డిని అడగాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగలకు ఏర్పాట్లు చేయదు. పనివేళలల్లో ఇలాంటి వెసులుబాటు ఇవ్వదు. తెలంగాణ ప్రజలు ఎలాంటి వ్యక్తులను ఎన్నుకున్నారో అర్థం చేసుకోవాలి. మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు 8వ నిజాం అయితే, సీఎం రేవంత్ రెడ్డి 9వ నిజాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.