Who is Divya Deshmukh: చెస్ వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళ.. ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?

Published : Jul 28, 2025, 09:08 PM IST

Who is Divya Deshmukh: దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 గెలిచి భారతదేశపు తొలి మహిళా విజేతగా నిలిచారు. అలాగే, నాల్గవ భార‌త‌ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా ఘ‌న‌త సాధించారు.

PREV
15
చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

జార్జియాలోని బటుమిలో జరిగిన ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో గెలిచి దివ్య దేశ్‌ముఖ్ చ‌రిత్ర సృష్టించారు. 38 ఏళ్ల కోనేరు హంపీని ఓడించిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ ఛాంపియ‌న్ గా నిలిచారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ ఘనతను సాధించారు. ఫిడే మహిళల వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు.

ఫైనల్ క్లాసికల్ గేమ్స్ రెండు డ్రాగా ముగియగా, విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ రాపిడ్ మ్యాచ్‌లు నిర్వహించారు. మొదటి రాపిడ్ గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో దివ్య నల్ల ముక్కలతో ఆడి గెలిచారు. దాంతో 2.5-1.5 స్కోరుతో వరల్డ్ కప్‌ను అందుకున్నారు.

25
గ్రాండ్ మాస్టర్‌గా దివ్య దేశ్‌ముఖ్ కొత్త చరిత్ర

ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్ భారతదేశానికి నాల్గవ మహిళా గ్రాండ్ మాస్టర్ గా మారారు. ఇప్పటి వరకు ఈ హోదా పొందిన వారిలో కోనేరు హంపీ, ద్రోణవల్లి హరికా, ఆర్ వైశాలిలు ఉన్నారు. టోర్నమెంట్ మొదలయ్యే సమయానికి దివ్యకు మూడు జీఎం నార్మ్‌లు ఏవీ లేవు, కానీ ఈ ఒక్క టోర్నీలోనే ఆమె టైటిల్‌కు అర్హత సాధించడం విశేషం.

గెలుపు త‌ర్వాత దివ్య దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. “ఈ విధంగా గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. పోటీ ప్రారంభానికి ముందు ఒక్క నార్మ్ కూడా నాకు లేదు. ఒక్క నార్మ్ అయినా వస్తుందేమో అనుకున్నాను. కానీ చివరికి గ్రాండ్ మాస్టర్ అయ్యాను” అని సంతోషం వ్య‌క్తం చేశారు.

35
ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్.. డాక్టర్లైన జితేంద్ర, నమ్రత దంపతుల కుమార్తె. ఆమె చిన్ననాటి నుంచే చెస్ పట్ల ఆసక్తి కనబరిచారు. 5 ఏళ్ల వయసులో చెస్ ఆడటం ప్రారంభించిన దివ్య దేశ్‌ముఖ్.. చెన్నైకి చెందిన గ్రాండ్ మాస్టర్ ఆర్‌బీ రమేశ్ వద్ద శిక్షణ పొందారు.

దివ్య దేశ్‌ముఖ్ 7 ఏళ్లకే అండర్-7 నేషనల్ టైటిల్, అండర్-10 (డర్బన్, 2014) టైటిల్, అండర్-12 (బ్రెజిల్, 2017) వరల్డ్ యూత్ టైటిల్స్‌ను గెలిచారు. 2021లో WGM, 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) హోదాలు పొందారు. 2024లో అండర్-20 వరల్డ్ జూనియర్ ఛాంపియన్ గా దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు.

45
ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ గెలిచిన దివ్య దేశ్‌ముఖ్

2024లో బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దానిలో దివ్య దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఆమె మూడుసార్లు ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడ‌ల్, అనేక ఆసియా, వరల్డ్ యువతి టైటిల్స్ గెలుచుకున్నారు.

55
దివ్య దేశ్‌ముఖ్ కెరీర్‌కు గొప్ప‌ ప్రారంభం

దివ్య దేశ్‌ముఖ్ విజయంతో భారత మహిళా చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టైటిల్‌ను గెలిచి, గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన ఈ 19 ఏళ్ల యువతి, భారత్‌కు గర్వకారణం. ఇదొక ముగింపు కాదు, ఆమె గొప్ప కెరీర్‌కు ప్రారంభం మాత్రమే

మహిళల చెస్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దివ్య దేశ్‌ముఖ్ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. తల్లిని కౌగిలించుకుని ఎమోష‌న‌ల్ అయిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories