Published : Nov 30, 2025, 09:52 PM ISTUpdated : Nov 30, 2025, 10:10 PM IST
IND vs SA : విరాట్ కోహ్లీ సెంచరీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నాక్ లతో రాంచీ వన్డేలో భారత్ విక్టరీ కొట్టింది. ఆరంభంలో భారత బౌలర్లు రాణించడంతో సౌతాఫ్రికాకు షాక్ తగిలింది.
India vs South Africa : రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విక్టరీ కొట్టింది. కానీ, ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠను రేపుతూ సాగింది. బాష్ దెబ్బకు భారత్ ఓటమి అంచువరకు వెళ్లింది. కానీ, చివరి ఓవర్ లో బాష్ అవుట్ తో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.
స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సూపర్ నాక్ లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరలో కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్ నాక్ ఆడాడు. భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ లో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో తడబడింది. టాపార్డర్ వికెట్లు త్వరగానే పడ్డాయి. అయితే, మిడిలార్డర్ రాణించడంతో 300+ స్కోర్ ను సాధించింది. విజయానికి దగ్గరగా వచ్చింది కానీ, దానిని అందుకోలేకపోయింది. 332 పరుగులు చేసింది సౌతాఫ్రికా. ఈ విజయంతో భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
25
రోహిత్, కోహ్లీ జోరు
టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఇద్దరి మధ్య తొలి వికెట్కు 25 పరుగులు వచ్చాయి.
జైస్వాల్ 18 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ అద్భతమైన ఆటతో అదరగొట్టాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. రోహిత్ 57 పరుగులు చేసి అవుటయ్యారు. కోహ్లీ, రోహిత్తో కలిసి కీలక భాగస్వామ్యం అందించారు. ఇద్దరి మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
35
విరాట్ కోహ్లీ సెంచరీ నాక్.. కేఎల్ రాహుల్ కెప్టెన్ నాక్
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. తన కెరీర్ లో 52వ వన్డే సెంచరీని బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధించాడు. 135 పరుగుల తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
చివరలో కేఎల్ రాహుల్ కూడా మంచి నాక్ ఆడాడు. 60 పరుగుల తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. రవీంద్ర జడేజా 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
హర్షిత్ రాణా భారత బౌలింగ్ ఇన్నింగ్స్ను సంచలనాత్మకంగా ప్రారంభించాడు. తన రెండో ఓవర్లో ర్యాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అలాగే, క్వింటన్ డి కాక్ కేఎల్ రాహుల్ కు చిక్కాడు. ఐడెన్ మార్క్రమ్ను అర్ష్దీప్ సింగ్ 7 పరుగుల వద్ద అవుట్ చేశాడు. త్వరగానే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సౌతాఫ్రికా.
కానీ, కొంత సమయం తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తిరిగి గాడిలో పడింది. జోరీ, బ్రీట్జ్కే మధ్య 66 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. హర్షిత్ రాణా ఆ తర్వాత ప్రోటీస్ ఐదవ వికెట్ను పడగొట్టి, బ్రెవిస్ను 37 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు.
55
కుల్దీప్ స్పిన్ అద్భుతం..సౌతాఫ్రికా బిగ్ ఫైట్
కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత కోర్టులోకి మ్యాచ్ ను తీసుకొచ్చాడు. ప్రమాదకరమైన ఫామ్లో ఉన్న మార్కో జాన్సెన్ను ట్రాప్ చేశాడు. ఆ తర్వాత మాథ్యూ బ్రీట్జ్కేను పెవిలియన్కు పంపాడు. మార్కో జాన్సెన్ 70 పరుగుల వద్ద అవుట్ కాగా, బ్రీట్జ్కే 72 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
అర్ష్దీప్ సింగ్ నాండ్రే బర్గర్ (17)ను అవుట్ చేసి దక్షిణాఫ్రికా తొమ్మిదవ వికెట్ తీశాడు. 50వ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మకు కార్బిన్ బాష్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. బాష్ 51 బంతుల్లో 67 పరుగులతో దక్షిణాఫ్రికాను విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు, కానీ మ్యాచ్ను పూర్తి చేయలేకపోయాడు.