Published : Jun 04, 2025, 06:55 PM ISTUpdated : Jun 04, 2025, 06:56 PM IST
అభిమానుల 18 ఏళ్ల కలను నిజం చేస్తూ ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025ని కైవసం చేసుకుంది. అయితే ఎంతో సంతోషంగా ముగియాల్సిన ఈ క్షణం కాస్త విషాదంగా మారింది. విక్టరీ పరేడ్లో అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది? కారణం ఏంటంటే..
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం తర్వాత నిర్వహించిన విక్టరీ పరేడ్ తీవ్ర విషాదానికి దారి తీసింది. 18 ఏళ్లుగా ఎదురుచూసిన టైటిల్ను గెలుచుకున్న ఆనందం క్షణాల్లో కన్నీటిలో మునిగిపోయింది. విజయోత్సవంలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాట 11 మంది ప్రాణాలు తీసింది.
25
ప్రమాదానికి అదే కారణమా.?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద RCB విజయోత్సవ పరేడ్ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో వేలాది మంది అభిమానులు గుమిగూడారు. కానీ, సంబంధిత గేట్లు సమయానికి తెరవకపోవడంతో అభిమానులు గేట్లను తోసుకుంటూ లోపలికి రావడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కొందరు కింద పడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
35
లాఠీఛార్జ్ చేసినా అదుపులోకి రాని పరిస్థితి
ఫ్యాన్స్ను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినా, విపరీతమైన రద్దీతో పరిస్థితి అదుపుతప్పింది. బారికేడ్లను కూల్చుతూ అభిమానులు లోపలికి రావడంతో, పోలీసులకు లాఠీఛార్జ్ తప్పలేదు. అయినా పరిస్థితి అదుపులోకి రాక, తీవ్ర విషాదానికి దారి తీసింది.
ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 37 మంది వరకు గాయపడినట్టు స్థానిక మీడియా చెబుతోంది. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
55
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫొటోలు
ఘటన జరిగిన క్షణాల్లో అభిమానులు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయాన్ని జరుపుకోవాలన్న ఉత్సాహమే ప్రాణాల్ని బలిగొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలే ఈ విషాదానికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు.