
భారత యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. బుధవారం రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో అద్భుత సెంచరీ కొట్టాడు. జాతీయ జట్టు తరఫున తొలి వన్డే సెంచరీని సాధించి ఒక భారీ వ్యక్తిగత మైలురాయిని చేరుకున్నాడు.
ఇది భారత సీనియర్ జట్టు తరఫున అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు భారత్-A తరఫున సెంచరీలు నమోదు చేసినా, అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఇది అతనికి మొదటిది.
గైక్వాడ్ కేవలం 77 బంతుల్లోనే ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఈ ధాటిగా ఆడుతూ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. సెంచరీ నాక్ లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ సెంచరీతో భారత జట్టు ఒక బలమైన స్కోరు సాధించింది.
తొలి వన్డేలో రాంచీలో దక్షిణాఫ్రికా 350 పరుగులను ఛేదించే క్రమంలో గట్టి పోటీనిచ్చిన నేపథ్యంలో, భారత్ ఈ మ్యాచ్లో 300 పరుగుల మార్కును దాటడం చాలా కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్కు సిరీస్ను గెలుచుకుంటుంది.
ఈ చిరస్మరణీయ సెంచరీ సాధించే క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో తన 53వ వన్డే సెంచరీని సాధించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి భారత్ స్కోర్ ను పరుగులు పెట్టించారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్లను పవర్ ప్లేలో కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అప్పుడే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్కు వచ్చి, విరాట్ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్నాడు.
రాయ్పూర్లో అద్భుత ప్రదర్శనతో రుతురాజ్ గైక్వాడ్ భారత జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ అయిన గైక్వాడ్, కోచ్ గౌతమ్ గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి విలువైన సెంచరీని నమోదు చేశాడు. ఇది వన్డే క్రికెట్లో గైక్వాడ్కు రెండవ 50+ స్కోరు. తొలి వన్డే లో కేవలం 8 పరుగులు చేసి విమర్శలు ఎదుర్కొన్న అతను, ఈ మ్యాచ్లో తన ప్రదర్శనతో విమర్శకులకు సమాధానం చెప్పాడు.
తొలుత కొంత ఆందోళన కలిగించే బంతులను ఎదుర్కొన్నప్పటికీ, గైక్వాడ్ త్వరగానే క్రీజులో కుదురుకున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ, విరాట్ కోహ్లీపై ఒత్తిడి లేకుండా చూసుకున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను తన భాగస్వామ్యానికి పూర్తి న్యాయం చేశాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఫీల్డ్ను ఛేదించడంలో అతని సామర్థ్యం. గ్యాప్ లను గుర్తించి షాట్స్ ఆడటం, సూపర్ స్వీప్లు, ఫ్లిక్లతో అదరగొట్టాడు.
అతను 52 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేసిన తర్వాత గేర్లు మార్చాడు. ఆఫ్-స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఒక్క ఓవర్లోనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్పై 16 పరుగులు రాబట్టాడు. ఈ తర్వాత గైక్వాడ్ వెనుదిరిగి చూడలేదు. అతను కేవలం 25 బంతుల్లోనే 50 నుండి 100 పరుగులకు చేరుకోవడం రాయ్పూర్లో సెంచరీతో మెరిశాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు 23 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడి 633 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు 50+ స్కోర్లు ఉన్నాయి. రాయ్పూర్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ అతని వన్డే ఫార్మాట్లో కేవలం 8వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఫార్మాట్లో అతను 200 పరుగుల మార్కును దాటి, తన తొలి సెంచరీని నమోదు చేశాడు.
టెస్టుల విషయానికి వస్తే, అతను ఇంకా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. గైక్వాడ్ ప్రపంచంలో అత్యధిక లిస్ట్-ఏ సగటు (58.02) ను నమోదు చేశాడు, ఇది దిగ్గజ క్రికెటర్ మైఖేల్ బెవన్ (57.86) రికార్డును అధిగమించడం విశేషం. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో, గైక్వాడ్కు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ ఇన్నింగ్స్తో అతను భారత వైట్-బాల్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు బలమైన వాదన వినిపించాడు.