
భారత్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ అధికారికంగా తొలగించింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అసహనానికి గురైంది. తమ మిత్రదేశమైన బంగ్లాదేశ్ను వెనకేసుకొస్తూ, ఐసీసీని పాకిస్థాన్ బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ జట్టు భారత్కు రావడానికి నిరాకరించిన నేపథ్యంలో, ఐసీసీ వారి స్థానంలో స్కాట్లాండ్ను టోర్నమెంట్లో చేర్చింది. ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్కు సపోర్టుగా పాకిస్థాన్ జట్టు భారత్తో జరిగే మ్యాచ్లను బాయ్కాట్ చేసే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి.
బంగ్లాదేశ్ ఈ టోర్నీలో ఆడకపోతే తాము కూడా ఆడబోమని పాకిస్థాన్ పరోక్షంగా ఇదివరకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఒకవేళ పాకిస్థాన్ మొత్తం టోర్నమెంట్నే బహిష్కరిస్తే, ఐసీసీ నుంచి కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదం వాటిల్లవచ్చు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డు మధ్య కొత్త చర్చలు జరుగుతున్నాయి. టోర్నమెంట్ మొత్తాన్ని కాకుండా, కేవలం భారత్తో జరిగే మ్యాచ్లను మాత్రమే బహిష్కరించి, మిగిలిన జట్లతో మ్యాచ్లు ఆడాలనే యోచనలో పాకిస్థాన్ ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా తమ నిరసన తెలపవచ్చని వారు భావిస్తున్నారు. అయితే, భారత్ తో ఓడిపోతామనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటోందని వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ పాకిస్థాన్ జట్టు భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తే, నిబంధనల ప్రకారం వారికి రెండు పాయింట్ల నష్టం వాటిల్లుతుంది. ఇది టోర్నీలో వారి అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహసిన్ నక్వీ స్పందించారు.
ఈ సున్నితమైన అంశంపై తాము పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకే తాము ముందుకు వెళ్తామని నక్వీ స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ను తొలగిస్తూ ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్లో ఆడేందుకు నిరాకరిస్తూ మొండి పట్టుదల ప్రదర్శించిన బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పుడు స్కాట్లాండ్ జట్టు టోర్నమెంట్లో అడుగుపెట్టింది. స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చినట్లు ఐసీసీ ఇప్పటికే ధృవీకరించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ లేఖ కూడా రాసింది.
బంగ్లాదేశ్ అవుట్ కావడంతో గ్రూప్-సిలో స్కాట్లాండ్కు చోటు దక్కింది. ఈ గ్రూప్లో ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, నేపాల్, ఇటలీ జట్లు ఉన్నాయి. గత మూడు వారాలుగా ఐసీసీ, బంగ్లాదేశ్ మధ్య తీవ్ర స్థాయిలొ చర్చలు జరిగాయి. తమ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని, గతంలో పాకిస్థాన్ డిమాండ్ చేసినట్లు బంగ్లాదేశ్ కోరింది.
కానీ, టోర్నీలో ఉండాలంటే భారత్కు వచ్చి ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చిచెప్పింది. ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా 14-2 ఓట్ల తేడాతో బంగ్లాదేశ్ మ్యాచ్లు భారత్లోనే జరగాలని నిర్ణయించారు. అయినప్పటికీ, తమ ఆటగాళ్లకు భారత్లో భద్రతా ముప్పు ఉందని బంగ్లాదేశ్ వాదించింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు పంపబోమని స్పష్టం చేసింది. అయితే, బంగ్లాదేశ్ భారత్తో ఇంతలా ఘర్షణ పడటానికి అసలు కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. ఇటీవల ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచే బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో ఆగ్రహం రగులుతోంది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా, ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాడిని తీసుకోవద్దని భారత్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల ఆగ్రహం, నిరసనల కారణంగానే ముస్తాఫిజుర్ను ఫ్రాంచైజీ వదులుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామమే బంగ్లాదేశ్ భారత్పై పగ పెంచుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.