IND vs ZIM : చావోరేవో.. టీమిండియా నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ అవుట్

Published : Feb 26, 2026, 07:55 PM IST

IND vs ZIM : 2026 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లపై వేటు వేసి శాంసన్, అక్షర్‌లను జట్టులోకి తీసుకున్నారు.

PREV
16
రింకు సింగ్‌పై వేటు.. అక్షర్ పటేల్ ఇన్! సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ చావో రేవో పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు ప్రధాన మార్పులు చేసినట్లు కెప్టెన్ ప్రకటించారు.

26
శాంసన్, అక్షర్ పటేల్ రీఎంట్రీ

గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి భారత జట్టు సమీకరణాలను మార్చేసింది. దీంతో జింబాబ్వేపై జట్టులో కీలక మార్పులు ఉండాలని మేనేజ్మెంట్ భావించింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న యువ బ్యాటర్ రింకూ సింగ్‌ను పక్కన పెట్టి, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి తుది జట్టులోకి వచ్చారు. గత 18 నెలలుగా అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమ్ ఇండియా, ఇలాంటి ఒత్తిడిలో ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

36
ఓపెనింగ్ జోడీపై ఆందోళన

భారత జట్టుకు ప్రస్తుత టోర్నీలో అతిపెద్ద సమస్య ఓపెనింగ్ భాగస్వామ్యం. ఈ టోర్నీలో భారత ఓపెనర్ల సగటు కేవలం 6.8గా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును వేధిస్తోంది. అతను గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 0, 0, 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. తొలి బంతికే సిక్స్ కొట్టాలనే ధోరణిని వీడి క్రీజులో సమయం గడపాలని అభిషేక్‌కు సూచించారు. గత తొమ్మిది అంతర్జాతీయ టీ20ల్లో ఐదుసార్లు డకౌట్ అయిన అభిషేక్‌కు తనను తాను నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశం కావచ్చు.

46
స్ట్రాటజీ మార్చిన సూర్యకుమార్ యాదవ్

టాస్ సమయంలో రవిశాస్త్రితో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో సానుకూల వాతావరణం ఉందని తెలిపారు. "గత మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి, ఏడాది కాలంగా ఆడుతున్న సహజ సిద్ధమైన ఆటను ఆడాలని జట్టుకు చెప్పాను. సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు, అతను ఇన్నింగ్స్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది" అని సూర్య పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమి ఎదురైందని, ఈసారి స్ట్రైక్ రొటేట్ చేస్తూ భారీ స్కోరు సాధించడమే లక్ష్యమని ఆయన వివరించారు.

56
రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ అవుట్.. కారణాలివే

రింకూ సింగ్ ఈ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో రాణించకపోవడంతో పాటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయారు. దీంతో అనుభవజ్ఞుడైన అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. అక్షర్ రాకతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు మరింత బలోపేతం కానుంది.

66
India vs Zimbabwe : ఇరు జట్ల తుది వివరాలు ఇవే

ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు సెమీస్ రేసు నుండి దాదాపు నిష్క్రమించినట్లే. దక్షిణాఫ్రికా ఇప్పటికే గ్రూప్-1 నుండి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా, భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

భారత్ ప్లేయింగ్-11:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే ప్లేయింగ్-11:

సికిందర్ రజా (కెప్టెన్), తడివానాశే మారుమణి, బ్రియన్ బెన్నెట్, డియోన్ మ్యైర్స్, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా, తాషింగ ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మాపోసా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరావా.

Read more Photos on
click me!

Recommended Stories