శ్రీరాముడి జన్మస్థలం ఆయోధ్యలో నిర్మించిన రామ మందిరం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. 500 ఏళ్ల తర్వాత సాకారమైన రామ మందిరాన్ని కనులారా వీక్షించేందు భారతదేశానికి చెందిన వారు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు వస్తున్నారు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఆయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ ఆలయాన్ని నాగర్ శైలిలో నిర్మించారు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీ రామ్లల్లా విగ్రహం, మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ నిర్మించారు. గుడి నిర్మాణంలో ఎక్కడా ఇనుమును ఉపయోగించలేదు. ఇలా చెప్పుకుంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
బాల రాముడి నుదిటిని సూర్య కాంతి తాకేలా ఏర్పాట్లు
అయోధ్య రామ మందిర నిర్మాణంలో మరో అద్భుతం సూర్య కిరణాలు బాల రాముడి విగ్రహాన్ని తాకేలా ఏర్పాటు చేయడం. నవమి రోజున బాలరామయ్యకు మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం చేస్తారు. దీంతో పాటు సూర్యకిరణాలతో తిలకం దిద్దేలా ఏర్పాటు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరిస్తాయి.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. అయితే ఈ అద్భుతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇంట్లో ఉండే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు. ఆలయం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలో బాలరాముడి నుదుటపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు.
దీని వెనకాల ఉన్న పురాణ నేపథ్యం ఏంటో తెలుసా.?
రామయ్యకు సూర్య కిరణాలతో తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేయడం వెనకాల పురాణ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకున్నారు. శ్రీరాముడిని సూర్యవంశానికి చెందినవాడిగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీరాముడు చైత్ర మాసంలో శుక్ల పక్ష నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని నమ్ముతారు. సూర్య కిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల దైవత్వం మేల్కొంటుందని విశ్వసిస్తారు.
శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన అయోధ్య
శ్రీరామనవి వేడుకలకు అంగరంగా వైభవంగా జరిపేందుకు అయోధ్యను సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఒక్క రోజే అయోధ్యకు సుమారు 20 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసి, తాగునీరు, 14 తాత్కాలిక ఆరోగ్యకేంద్రాల్లో ఓఆర్ఎస్ వంటివి అందుబాటులో ఉంచింది. వైద్యులు, ఏడుచోట్ల 108 అంబులెన్సులను సిద్ధం చేసింది. ఇక, డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై జల్లనున్నారు.