
Ajit Pawar, Sunetra Pawar : మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. డిప్యూటీ సీఎం, ఎన్సిపి నేత అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానాన్ని భర్తీచేసి పార్టీని ముందుండి నడపడానికి భార్య సునేత్ర పవార్ సిద్దమయ్యారు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న ఆమె భర్త స్థానంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంతా అనుకున్నట్లు జరిగితే మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ మారనున్నారు. మహా రాజకీయాల్లో పవర్ ఫుల్ మహిళా నేతగా గుర్తింపు పొందనున్నారు. అయితే ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి సునేత్ర ఎడ్యుకేషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇంతకు ఆమె ఏం చదువుకున్నారో తెలుసా..?
దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ 1963 అక్టోబర్ 10న జన్మించారు. ఆమె పుట్టిన గ్రామం మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా తేర్. భారత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో సునేత్ర జన్మించారు... ఆమె తండ్రి కూడా స్వాతంత్య్రయోధుడే. గ్రామంలో బాగా పలుకుబడి ఉన్న వ్యవసాయ కుటుంబంలో సునేత్ర పుట్టిపెరిగారు.
సునేత్ర పవార్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా స్థానికంగానే సాగింది. ఇక ఏప్రిల్ 1983లో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం నుండి బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఔరంగాబాద్లోని ఎస్.బి. ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
అయితే ఇలా సాంప్రదాయ చదువులే కాదు సోషల్, ఎన్విరాన్మెంట్కు సంబంధించిన కోర్సులు కూడా చేశారు సునేత్ర. ఇక పుస్తకాలు కనిపిస్తే చాలు ఆమె వదిలిపెట్టరు... బాగా చదవడం ఆమె హాబీగా కుటుంబసభ్యులు చెబుతుంటారు. నేచర్ ఫోటోగ్రఫీ, పెయింటింగ్ కూడా ఆమెకు ఇష్టమైన హాబీలు.
అజిత్ పవార్ తో వివాహం తర్వాత చాలాకాలం కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు సునేత్ర. అయితే పిల్లలు పెద్దవాళ్లు కావడంతో ఆమెలోని రాజకీయ నాయకురాలు బయటకు వచ్చారు. భర్త చాటు భార్యగా రాజకీయ రంగప్రవేశం చేసినా చాలా తక్కువ సమయంలోనే సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారు.
ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తితో సునేత్ర పవార్ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు.. అయితే విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమె రాజకీయ ప్రయాణం ఆగలేదు. జూన్ 18, 2024న రాజ్యసభ సభ్యురాలై పార్లమెంట్ లో అడుగుపెట్టారు.. ఎగువ సభలో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించారు. ఇప్పుడు కేవలం రెండేళ్లలోపే ఆమె డిప్యూటీ సీఎంగా మారనున్నారు. ఈ పదవి ఆమెను రాష్ట్రంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళా నేతల్లో ఒకరిగా నిలబెడుతోంది.
రాజకీయాలకు ముందు సునేత్ర పవార్ సామాజిక, సంస్థాగత పనులలో చురుకుగా ఉండేవారు. ఆమె బారామతి హైటెక్ టెక్స్టైల్ పార్క్, ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (ఎన్జీఓ) అధ్యక్షురాలు. అంతేకాకుండా పూణే జిల్లా విద్యా మండలి, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. వ్యవసాయం, విద్యకు సంబంధించిన అనేక సంస్థలలో ట్రస్టీగా ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
గత 23 ఏళ్లుగా సునేత్ర పవార్ నిరంతరం సమాజసేవలో నిమగ్నమై ఉన్నారు. ఆరోగ్య రంగంలో ఉచిత కంటిశుక్లం ఆపరేషన్ క్యాంపులు, క్యాన్సర్ అవగాహన ప్రచారాలు, మహిళల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ఆమెకు గుర్తింపు తెచ్చింది. విద్యా రంగంలో సైన్స్ ఫెయిర్లు, ప్రదర్శనల ద్వారా పిల్లలలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించారు. ఈ ప్రయత్నాల వల్లే ఆమెకు జీవన్ గౌరవ్ పురస్కార్, గ్రీన్ వారియర్ అవార్డు, లోక్మత్ ఐకాన్ అవార్డు, రాష్ట్రమాత జిజావూ పురస్కార్ 2024 వంటి అనేక పెద్ద గౌరవాలు లభించాయి.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. భర్త ప్రాతినిధ్యం వహించిన బారామతి నుండి ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుంది... తల్లి స్థానంలో పార్థ్ పవార్ ను పార్లమెంట్ కు వెళతారనే ప్రచారం జరుగుతోంది.
అజిత్ పవార్-సునేత్ర దంపతుల పెద్ద కుమారుడు పార్థ్ పవార్ కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు... అందుకే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే తండ్రి మరణంతో పార్థ్ పవార్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ గా మారనున్నారు.