Divya shanker Case
ప్రసన్న శంకర్ నారాయణ ఒక ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్. హెచ్ఆర్ టెక్ స్టార్టప్ కంపెనీ రిప్లింగ్ వ్యవస్థాపకుడైన శంకర్ ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. రిప్లింగ్ కంపెనీ సుమారు 10 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. ఇదంతా బాగానే ఉన్నా 12 ఏళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిదీ చెన్నై కాగా వివాహం తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ జంటకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
వేల కోట్ల సంపాదన, అమెరికాలో సొంత కంపెనీ.. జీవితం సాఫీగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో శంకర్-దివ్యల మధ్య గత కొన్నిరోజుల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇద్దరూ విడాకుల కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నారు. భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేసింది. దీనిపై అమెరికా కోర్టులో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ అంశం కాస్త తాజాగా ఇండియాకు చేరింది.
ఇటీవల భారత్కు వచ్చిన దివ్య.
అమెరికా కోర్టు శంకర్కు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, శంకర్ తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు దివ్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శంకర్ కోసం వెతకడం ప్రారంభించారు.
అయితే పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్న శంకర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ పోలీసుల వ్యవహరంపై ప్రశ్నించారు శంకర్. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడిని కిడ్నాప్ చేయలేదని, ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడంటూ వీడియో పోస్ట్ చేశాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే తప్పించుకున్నట్లు తెలిపాడు. అయితే అరెస్ట్ చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు.
Divya Shanker issue
శంకర్ వాదన ఏంటంటే.?
తన బార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ కారణంగానే తమ మధ్య గొడవలు జరిగాయని శంకర్ ఆరోపిస్తున్నాడు. తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు అమెరికాలో కేసు నమోదు చేసిందని అయితే అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... 'నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని' చెప్పుకొచ్చారు. అనూప్ అనే జిమ్ ట్రైనర్తో తనకు భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపిస్తున్నాడు శంకర్.
మరి దివ్య వెర్షన్ ఏంటి.?
మరోవైపు దివ్య కూడా శంకర్పై విమర్శలు గుప్పిస్తోంది. తన భర్త కామ పిశాచి అంటూ విమర్శించింది. అమ్మాయిలను అసభ్య వీడియోలు తీస్తాడని తెలుపుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని తెలిపింది.
ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా రచ్చకు దారి తీసింది. కొన్ని వేల కోట్ల సంపాదన, అమెరికాలో సొంత కంపెనీ నెలకొల్పి, వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్న వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా వార్తల్లో నిలవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మరి శంకర్, దివ్యల వ్యవహారానికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.