
తమిళనాడు రాజకీయాల్లో ఎన్నడూ చూడని ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా దూరంగానే ఉంది. పార్టీ అధినేత విజయ్ వరుసగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా స్పష్టత రావడం లేదు. “అతి పెద్ద పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వాలా? లేక పూర్తి మెజార్టీ నిరూపించిన తర్వాతే ఆహ్వానం ఇవ్వాలా?” అన్న చర్చ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల కేంద్రబిందువుగా మారింది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. అయితే విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో ఒక సీటును వదులుకోవాల్సి వస్తోంది. దీంతో పార్టీ బలం 107కి తగ్గనుంది. కాంగ్రెస్ మద్ధతుతో ఈ సంఖ్య 112కి చేరినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సంఖ్య ఇంకా అందుబాటులోకి రాలేదు. అంటే విజయ్కు కనీసం మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. ప్రస్తుతం వామపక్షాలు, వీసీకే, చిన్న ప్రాంతీయ పార్టీలు ఏ వైపు నిలుస్తాయన్నదే కీలక అంశంగా మారింది. ఇదే కారణంగా గవర్నర్ కూడా “ముందుగా పూర్తి మెజార్టీ చూపించండి” అనే వైఖరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో 15 రోజుల్లో బల నిరూపణ చేసుకుంటానని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే గవర్నర్ మాత్రం రాజ్భవన్లో సంఖ్యాబలం స్పష్టంగా కనిపించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. “అసెంబ్లీలో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి” అని టీవీకే వాదిస్తుండగా, “ముందుగా మెజార్టీ ఆధారాలు చూపాలి” అని గవర్నర్ కార్యాలయం చెబుతోంది. ఈ వివాదమే ప్రస్తుతం సీఎం ప్రమాణ స్వీకారం ఆలస్యానికి ప్రధాన కారణంగా మారింది.
ప్రస్తుతం తమిళనాడులో చిన్న పార్టీల పాత్ర అత్యంత కీలకంగా మారింది. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు టీవీకేకు మద్ధతు ఇవ్వొచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. డీఎంకే కూడా ఆసక్తికరమైన వైఖరి తీసుకుంది. “అతి పెద్ద పార్టీగా టీవీకేకే ముందుగా అవకాశం ఇవ్వాలి” అని చెబుతున్నప్పటికీ ప్రత్యక్ష మద్ధతుపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇక ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్ధతు లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచుతోంది.
ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్కు ముఖ్యమంత్రి స్థాయి భద్రత, కాన్వాయ్ వాహనాలు అందించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో స్పష్టత రాకపోవడంతో విజయ్ ఆ వాహనాలను తిరిగి పంపించడం చర్చనీయాంశమైంది. “ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు సీఎం కాన్వాయ్ అవసరం లేదు” అని విజయ్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన రాజకీయంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక గవర్నర్ను కలవడానికి కూడా ప్రభుత్వ వాహనం ఉపయోగించకుండా వ్యక్తిగత వాహనంలో వెళ్లడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వ్యవహారంపై సినీ రంగం నుంచి కూడా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. నటుడు ప్రకాశ్ రాజ్ ప్రజా తీర్పును గౌరవించాలని వ్యాఖ్యానించారు. “అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కమల్ హాసన్ కూడా గవర్నర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “మెజార్టీ నిరూపించాల్సింది శాసనసభలోనే కానీ రాజ్భవన్లో కాదు” అని గత సుప్రీంకోర్టు తీర్పులను గుర్తు చేశారు.
నటుడు విశాల్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో బలపరీక్షకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో మాత్రం ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.
ప్రస్తుతం తమిళనాడులో మూడు అవకాశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. మొదటిది.. చిన్న పార్టీల మద్ధతు సమీకరించి విజయ్ మెజార్టీ సంఖ్య చేరుకోవడం. రెండోది.. గవర్నర్ చివరకు అతి పెద్ద పార్టీగా టీవీకేను ఆహ్వానించి బలపరీక్షకు అవకాశం ఇవ్వడం. మూడోది.. పరిస్థితి మరింత క్లిష్టమైతే న్యాయపోరాటం ప్రారంభమవడం.
టీవీకే వర్గాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మద్ధతు సమీకరణలో విజయ్ బృందం తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు తమిళనాడులో ప్రజలు స్పష్టంగా మార్పునకు ఓటు వేసినా, ఆ మార్పు అధికారంగా మారడానికి ఇంకా రాజకీయ గణితం పూర్తి కాలేదు. అందుకే ప్రస్తుతం చెన్నై రాజకీయం “విజయ్ సీఎం అవుతారా? లేక తమిళనాడు మరో రాజకీయ మలుపు చూస్తుందా?” అన్న ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది.