
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET UG 2026) వివాదంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఊహించని పెద్ద నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగబోయే నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ కంటే ముందే ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) పై భారత్లో తాత్కాలికంగా నిషేధం విధించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ముఠాలు, సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్స్ ఈ యాప్ను వాడుకుంటున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాక్షన్కు దిగింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్లో ఫేక్ పేపర్లు అమ్ముతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అంతేకాదు, టెలిగ్రామ్లో ఉండే ఒక ఫీచర్ను వాడుకుని, పరీక్ష అయిపోయిన తర్వాత పేపర్ ముందే లీక్ అయినట్టు ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేస్తున్నారని తేలింది. అందుకే జూన్ 22 వరకు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తూ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంలో రెండు విడివిడి ఆదేశాలను జారీ చేసింది. మొదటి ఆర్డర్ ప్రకారం.. నీట్ రీ-టెస్ట్ ముగిసే వరకు అంటే జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్ను ఇండియాలో తాత్కాలికంగా నిలిపివేస్తారు.
రెండో ఆర్డర్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 69A కింద జూన్ 30 వరకు టెలిగ్రామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్లను ‘ఎడిట్’ చేసే ఫీచర్ను ఇండియాలో డిసేబుల్ చేయాలని ఆదేశించింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్లను పెద్ద ఎత్తున డిలీట్ చేసినా లాభం లేకపోవడంతోనే, ఈ సారి పక్కా టైమ్ బౌండ్ ప్లాన్తో ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది.
గత కొన్ని నెలలుగా టెలిగ్రామ్ లో సాగుతున్న మోసాలపై ఎన్టీఏ గట్టిగా నిఘా పెట్టింది. పరీక్షలను టార్గెట్ చేస్తూ కొన్ని ఆర్గనైజ్డ్ చీటింగ్ ముఠాలు, సైబర్ క్రైమ్ నెట్వర్క్లు యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్లో "PAPER LEAKED NEET", "Re-NEET 2026", "Private Mafia", "REE NEET MAFIAA" లాంటి పేర్లతో ఓపెన్గా ఛానెళ్లు నడుపుతున్నారని ఎన్టీఏ వెల్లడించింది.
ఈ ఛానెళ్ల నిర్వాహకులు.. తమ దగ్గర నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఉందంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నమ్మించి కొన్ని వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. అయితే, సెక్యూర్డ్ ఎగ్జామ్ ప్రాసెస్ వెలుపల ఎలాంటి క్వశ్చన్ పేపర్ లేదని, ఇలా పేపర్లు ఇస్తామనే వాగ్దానాలన్నీ వంద శాతం పక్కా ఫ్రాడ్ అని ఎన్టీఏ హెచ్చరించింది.
టెలిగ్రామ్ యాప్ను ఎందుకు టార్గెట్ చేశారనే దానికి ఎన్టీఏ ఒక షాకింగ్ రీజన్ చెప్పింది. అదే టెలిగ్రామ్లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్. నార్మల్గా టెలిగ్రామ్లో పాత మెసేజ్లను ఎడిట్ చేసినా, ఆ పాత టైమ్స్టాంప్ అలాగే ఉంటుంది. పిడిఎఫ్ ఫైళ్లను కూడా మార్చేయొచ్చు. ఈ లూప్హోల్ను కేటుగాళ్లు బాగా వాడుకున్నారు.
వీళ్లు ఏం చేస్తారంటే.. ఎగ్జామ్కు ముందే ఒక నార్మల్ మెసేజ్ పెడతారు. పరీక్ష అయిపోయాక ఆ పాత మెసేజ్ను ఎడిట్ చేసి, ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ను అందులో పెడతారు. ఆ తర్వాత స్క్రీన్షాట్లు తీసి.. ‘చూశారా, ఎగ్జామ్కు ముందే మా ఛానెల్లో పేపర్ వచ్చేసింది’ అంటూ లీక్ డ్రామాలు క్రియేట్ చేస్తారు. ఇలాంటి ఫేక్ లీక్ ఆధారాలను అడ్డుకోవడానికే జూన్ 30 వరకు ఎడిట్ ఫీచర్ను ఇండియాలో బంద్ చేయించారు.
ఈ టెలిగ్రామ్ ఫ్రాడ్ ముఠాలను పట్టుకోవడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కొన్ని వారాలుగా ఆపరేషన్ చేస్తోంది. ఎన్టీఏ, స్టేట్ పోలీస్ ఇచ్చిన ఇన్పుట్స్తో చాలా ఫేక్ ఛానెళ్లు, గ్రూపులు, బాట్లను డిలీట్ చేయించారు. బీహార్ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ జూన్ 9నే విద్యార్థులను ఈ ఫేక్ లీకులపై అలర్ట్ చేసింది. అటు అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంతర్రాష్ట్ర సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్ను అరెస్ట్ చేసింది.
ఈ గ్యాంగ్ ఏకంగా 8 టెలిగ్రామ్ ఛానెళ్లు నడుపుతూ, దాదాపు 1.5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఒకే నెలలో 1,000 మొబైల్ నంబర్లను కాంటాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఏ ఎక్స్ లో "ఎగ్జామ్కు ముందే క్వశ్చన్ పేపర్ ఎవరికీ దొరకదు, ఇలాంటి వదంతులను నమ్మకండి" అని హెచ్చరించింది.
భారత్ తీసుకున్న ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) తీవ్రంగా తప్పుపట్టారు. పేపర్ లీక్స్ను అడ్డుకోవడంలో ఈ బ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఇండియాలో ఉన్న 15 కోట్ల మంది సాధారణ టెలిగ్రామ్ యూజర్లను శిక్షించినట్టు అయిందని ఎక్స్ లో రాసుకొచ్చారు.
"కొందరు యూజర్లు పేపర్ లీక్ క్వశ్చన్లు షేర్ చేశారని ఐటీ శాఖ టెలిగ్రామ్ను బ్యాన్ చేసింది. కానీ దీనివల్ల లీక్ చేసిన ఇన్సైడర్లకు ఏం కాలేదు, సాధారణ యూజర్లు ఇబ్బంది పడ్డారు" అని దురోవ్ అన్నారు. అంతేకాదు, ఈ బ్యాన్ వల్ల అక్రమాలు ఆగలేదని, లీకులు కేవలం టెలిగ్రామ్ నుంచి వేరే యాప్స్లోకి మారిపోయాయని ఆయన కామెంట్ చేశారు. కోట్ల మంది బిజినెస్, పర్సనల్ కమ్యూనికేషన్ కోసం వాడే యాప్ను ఆపడం కరెక్ట్ కాదని ఆయన వాదించారు.