Real estate: దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పెరుగుతోంది. ప్రాంతంతో సంబంధం లేకుండా భూములు, ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పుణె నగరంలో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా పెరుగుతోందన్న మాటలు వినిపిస్తున్న వేళ, పుణెకు చెందిన కూనాల్ గాంధీ అనే యువకుడు తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఫ్లాట్ల ధరలు చూస్తుంటే నిజంగా డిమాండ్ అంతగా పెరిగిందా? లేక ఈ బూమ్ ఎప్పుడైనా పేలే ప్రమాదముందా? అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.
25
సొంతింటి ప్రయత్నంలో ఎదురైన షాక్
పుణెలో సొంత ఇల్లు కొనాలన్న ఆలోచనతో కొంతకాలంగా వెతుకుతున్నానని కూనాల్ తెలిపారు. గత నెలలో వాకడ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రాజెక్ట్ను సందర్శించి ధరల గురించి తెలుసుకున్నానన్నారు. అక్కడ త్రీ బెడ్రూం ఫ్లాట్కు రూ.1.80 కోట్లు చెప్పారు. ఇంట్లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయానని వివరించారు.
35
నెల రోజుల్లో రూ.20 లక్షల పెరుగుదల
కొంతకాలం తర్వాత అదే ఫ్లాట్ కోసం మళ్లీ వెళ్లిన కూనాల్కు షాక్ తగిలింది. నెల రోజుల్లోనే ధర రూ.2 కోట్లకు చేరిందని అక్కడి సేల్స్ టీమ్ చెప్పిందన్నారు. అంత తక్కువ సమయంలో రూ.20 లక్షలు ఎలా పెరిగాయని ప్రశ్నించగా, డిమాండ్ ఎక్కువగా ఉండటమే కారణమని సమాధానం ఇచ్చారని తెలిపారు.
ఇంతటితో ఆగకుండా మరో వారం పది రోజుల్లో అదే ఫ్లాట్ ధర రూ.2.15 కోట్లకు చేరే అవకాశం ఉందని డెవలపర్ చెప్పాడని కూనాల్ వెల్లడించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ప్రతీ ప్రాజెక్ట్లో ధరలు వేగంగా పెరుగుతున్నాయని వివరించారని అన్నారు.
55
బూమ్ వెనుక నిజం ఏంటి?
ఈ స్థాయిలో ధరల పెరుగుదల చూస్తుంటే ‘పెరుగుట విరుగుట కొరకేనా?’ అనే అనుమానం కలుగుతోందని కూనాల్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు యూజర్లు నిజంగానే రెసిడెన్షియల్ మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగిందని అభిప్రాయపడితే, మరికొందరు మాత్రం ఇది సహజమైన డిమాండ్ కాదని, కేవలం బూమ్ మాత్రమేనని కామెంట్లు పెడుతున్నారు.