President Train: సాధారణంగా రాష్ట్రపతి విమానంలో లేదా ఎస్కార్ట్ వాహనంలో ప్రయణిస్తారు. అయితే తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రైలులో ప్రయాణించారు. 170 కిలోమీటర్ల ఈ ప్రయాణం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
ద్రౌపది ముర్ము మూడు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా మొదట హెలికాప్టర్లో వెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. అయితే వర్ష సూచనలు ఉండటంతో చివరి నిమిషంలో ఆ ప్రణాళికను మార్చి 'ప్రెసిడెంట్ స్పెషల్' రైలులో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వర్ నుంచి బెర్హంపూర్ వరకు సుమారు 170 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో పూర్తి చేశారు.
ఈ ప్రత్యేక రైలులో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఎయిర్ కండీషన్డ్ బెడ్రూమ్లు, ప్రత్యేక లివింగ్, డైనింగ్ హాల్, వంటగది వంటి అన్ని వసతులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, గవర్నర్ హరి బాబు కంభంపాటి కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.
24
ముందు ఒక రైలు.. వెనుక మరో రైలు..
రాష్ట్రపతి రైలు ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన విషయం భద్రతా ఏర్పాట్లు. రాష్ట్రపతి ప్రయాణించే ప్రత్యేక రైలుకు ముందు ఒక రైలు, వెనుక మరో రైలు నడిపిస్తారు. దీనివల్ల ట్రాక్ పూర్తిగా సురక్షితంగా ఉందో లేదో నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న సమయంలో అదే ట్రాక్పై మరో రైలుకు అనుమతి ఉండదు. ప్రయాణం పూర్తయ్యే వరకు మొత్తం మార్గాన్ని పూర్తిగా భద్రతా వలయంలో ఉంచుతారు. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం సాగుతుంది.
34
రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత
రాష్ట్రపతి పర్యటన కోసం భువనేశ్వర్, బెర్హంపూర్ రైల్వే స్టేషన్లలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబు నిర్వీర్య దళాలు, స్నిఫర్ డాగ్ బృందాలు, సామాన్లకు ప్రత్యేక స్కానింగ్ వంటి చర్యలు చేపట్టారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), కేంద్ర భద్రతా బలగాల కమాండోలు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించారు.
రాష్ట్రపతి ఎక్కే ప్లాట్ఫామ్ నుంచి ప్రత్యేక కోచ్ వరకు ఎర్ర తివాచీ (రెడ్ కార్పెట్) ఏర్పాటు చేశారు. అలాగే భువనేశ్వర్, బెర్హంపూర్ స్టేషన్లలో ఒక్కో చోట సుమారు 450 మంది పోలీసు సిబ్బందితో 15 ప్లాటూన్లను మోహరించారు. రాష్ట్రపతి పర్యటించిన ప్రాంతాలను తాత్కాలికంగా 'నో-ఫ్లయింగ్ జోన్'గా కూడా ప్రకటించారు.
భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తరచూ రైలులోనే పర్యటించేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా 'ప్రెసిడెన్షియల్ సలూన్' అనే రైల్వే కోచ్ ఉండేది. ప్రస్తుతం ఆ చారిత్రక కోచ్ను ఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా గతంలో 2025లో ఢిల్లీ నుంచి వృందావన్ వరకు మహారాజా ఎక్స్ప్రెస్లో ప్రయాణించి బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో 18 కోచ్లలో 12 కోచ్లను రాష్ట్రపతి బృందం కోసం ప్రత్యేకంగా కేటాయించారు.
చారిత్రక రైల్వే మార్గంలో రాష్ట్రపతి ప్రయాణం
ఈసారి రాష్ట్రపతి ప్రయాణించిన భువనేశ్వర్–బెర్హంపూర్ రైల్వే మార్గంలోని సుమారు 100 కిలోమీటర్ల ట్రాక్ బ్రిటిష్ కాలం నాటిది. ఇది 1896 మార్చి 1న ప్రారంభమైన ఒడిశాలోని అత్యంత పురాతన రైల్వే మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ప్రపంచ ప్రఖ్యాత చిల్కా సరస్సు మీదుగా వెళ్తుంది. ప్రకృతి అందాలతో నిండిన ఈ మార్గం ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఒడిశా ప్రముఖ కవి, స్వాతంత్ర సమరయోధుడు ఉత్కళమణి గోపబంధు దాస్ కూడా బ్రిటిష్ పాలనలో జైలుకు తరలిస్తుండగా ఇదే మార్గంలో ప్రయాణించి, చిల్కా సరస్సు అందాలను వర్ణిస్తూ ఒక ప్రసిద్ధ కవిత రాశారు. ఈ కారణంగా ఈ రైల్వే మార్గానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు సాంస్కృతిక విలువ కూడా ఉంది.