Himalayan Snow Bombs: నేపాల్ లో వరదలు పెను విధ్వంసం రేపాయి. ఈ క్రమంలోనే హిమాలయాల్లో 88 గ్లేషియర్ లేక్స్ టైమ్ బాంబుల్లా మారాయి. భారత్లోని 6 రాష్ట్రాలపై నేపాల్ కంటే పెద్ద ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తల రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి.
హిమాలయాల్లో 88 స్నో బాంబులు: భారతదేశంలోని 6 రాష్ట్రాలకు నేపాల్ కంటే పెద్ద ప్రమాదం?
హిమాలయాల్లో మంచు కరిగి కొత్త ముప్పు వచ్చిపడుతోంది. నేపాల్లో ఇటీవల సంభవించిన భయంకరమైన వరదలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. దానికంటే అత్యంత భయంకరమైన ప్రమాదం ఇప్పుడు భారతదేశం పైకి దూసుకొస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు 88 ‘స్నో బాంబులు’ అంటే ప్రమాదకరమైన గ్లేషియర్ సరస్సులు టైమ్ బాంబుల్లా టిక్ టిక్ మంటూ పేలడానికి సిద్ధంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఇవి గనుక పేలితే మన దేశంలోని ఆరు రాష్ట్రాలు నేపాల్ కంటే దారుణమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఐఐటీ రోపర్, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ సంయుక్తంగా విడుదల చేసిన పరిశోధనా రిపోర్టు ప్రకారం.. భారతదేశానికి రాబోయే రోజుల్లో ఊహించని ముప్పు ఉంది. 1990నాటికి హిమాలయ ప్రాంతంలో కేవలం 107 గ్లేషియర్ సరస్సులు మాత్రమే ఉండేవి.
కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 670 దాటిపోయింది. వీటిలో 88 సరస్సులు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. చిన్నపాటి భూకంపం వచ్చినా లేదా క్లౌడ్ బరస్ట్ సంభవించినా ఇవి బద్దలై నేపాల్ తరహా ప్రళయాన్ని సృష్టిస్తాయి. వీటిలో మొదటిది బద్దలైతే జమ్మూ కాశ్మీర్, రెండోది పేలితే హిమాచల్ ప్రదేశ్, మూడోది పగిలితే ఉత్తరాఖండ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
36
ఇస్రో ఉపగ్రహ డేటా: 601 సరస్సుల పరిమాణం డబుల్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) 1984 నుండి 2023 వరకు ఉపగ్రహ డేటాను విశ్లేషించింది. ఈ అధ్యయనంలో 10 హెక్టార్ల కంటే పెద్దవైన 2,431 గ్లేషియర్ సరస్సులను గుర్తించగా,వాటిలో 676 సరస్సులు వేగంగా విస్తరిస్తున్నట్లు తేలింది.
601 సరస్సులు: గత కొన్ని ఏళ్లలోనే పరిమాణంలో రెట్టింపు అయ్యాయి.
10 సరస్సులు: 1.5 నుండి 2 రెట్లు పెరిగాయి.
65 సరస్సులు: 1.5 రెట్ల వరకు విస్తరించాయి.
ఈ దారుణమైన మార్పుకు కారణం మంచు పర్వతాలు నిరంతరం కరిగిపోతుండటమే. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లోని 'ఘేపాంగ్ ఘాట్' సరస్సు 1989లో 36.49 హెక్టార్లు ఉండగా, 2022 నాటికి 101.30 హెక్టార్లకు పెరిగింది. అంటే ఏకంగా 178 శాతం విస్తరించింది.
4,000 మీటర్ల ఎత్తులో టైమ్ బాంబులు.. ఏ క్షణమైనా విధ్వంసం
ఇస్రో శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం ఏంటంటే.. ఈ గ్లేషియర్ సరస్సులు చాలా ఎత్తులో ఉన్నాయి. పెరుగుతున్న 676 సరస్సులలో 314 సరస్సులు సముద్ర మట్టానికి 4,000 నుండి 5,000మీటర్ల ఎత్తులో ఉండగా, 296 సరస్సులు 5,000మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి.
ఇంత ఎత్తులో ఉండే సహజసిద్ధమైన మంచు లేదా రాతి కట్టడాలు కంక్రీట్ డ్యామ్లంత బలంగా ఉండవు. భూకంపాలు, మంచు తుఫాన్లు లేదా కొండచరియలు విరిగిపడినప్పుడు ఈ కట్టడాలు తెగిపోతాయి. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే కోట్లాది లీటర్ల నీరు ఒక్కసారిగా కిందికి దూసుకొస్తుంది. దీనినే సాంకేతికంగా 'గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్' (GLOF) అంటారు.
56
ముప్పులో 6 భారతీయ రాష్ట్రాలు.. మైదాన ప్రాంతాలకు అలెర్ట్
ఈ హిమాలయ 'స్నో బాంబుల' ప్రభావం కేవలం పర్వతాలకే పరిమితం కాదు. అక్కడి నుంచి ప్రవహించే సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలపై ఇది ప్రత్యక్షంగా పడుతుంది. ఐఐటీ రోపర్ రిపోర్టు ప్రకారం ప్రధానంగా ఆరు ప్రాంతాలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి:
జమ్మూ & కాశ్మీర్
లడఖ్
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
సిక్కిం
అరుణాచల్ ప్రదేశ్
ఈ నీరు కిందకి వస్తే పర్వత లోయల్లో ఉన్న పట్టణాలు, వంతెనలు,రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులతో పాటు కోట్లాది మంది జనాభా కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకే ఇది పర్యావరణ సమస్య మాత్రమే కాదు,జాతీయ భద్రతా ముప్పుగా మారింది.
హిమాలయాల్లోని 0.25 హెక్టార్ల కంటే పెద్దవైన 28,043 సరస్సులను ఇస్రో మ్యాపింగ్ చేసింది. అయితే ఈ ప్రాంతాలకు నేరుగా వెళ్లి పరిశోధనలు చేయడం వాతావరణ పరిస్థితుల వల్ల చాలా కష్టం. అందుకే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)సాయంతో డ్రోన్లు, హై-రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా GLOF పోర్టల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నేపాల్ తరహా విపత్తు సంభవించే వరకు వేచి చూడకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రియల్ టైమ్ సెన్సార్లను వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తేనే ఈ స్నో బాంబుల నుంచి మన దేశాన్ని కాపాడుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.