Heavy Rain Alert : ఇండియా నుండి కొరియా వరకు 10000 కిమీ మేఘాలు.. బంపర్ మాన్‌సూన్ డేస్ షురూ, ఇక్కడ కుండపోత వానలతో అల్లకల్లోలమే

Published : Jul 24, 2026, 01:47 PM IST

భారతదేశం నుంచి దక్షిణ కొరియా వరకు సుమారు 10,000 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ మేఘాల సమూహాన్ని శాటిలైట్స్ గుర్తించాయి. ఇది 2026 నైరుతి రుతుపవనాల అత్యంత క్రియాశీల దశకు సంకేతమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

PREV
15
బంపర్ మాన్‌సూన్ డే

Heavy Rain Alert : ప్రస్తుతం ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భారతదేశం నుంచి మొదలై హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు ఏకంగా 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల పొడవున భారీ మేఘాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేఘాల గొలుసు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించినట్లు... ఇది 2026 నైరుతి రుతుపవనాల అత్యంత కీలకమైన, శక్తివంతమైన దశకు నిదర్శనమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 'మాన్‌సూన్ కన్వర్జెన్స్ జోన్' అని పిలిచే ఈ మేఘాల గొలుసు హిందూ మహాసముద్రం నుంచి తేమతో కూడిన గాలుల వల్ల ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

ఈ భారీ మేఘాల ప్రభావంతోనే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రెండు రోజుల్లో దేశంలో సాధారణంగా కురవాల్సిన వర్షం కంటే 170 నుంచి 180 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. అందుకే వాతావరణ నిపుణులు దీన్ని 'బంపర్ మాన్‌సూన్ డే' అని పిలుస్తున్నారు.

25
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ప్రస్తుతం మధ్య, ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఇక్కడి నుంచి ఈశాన్య దిశగా హిమాలయాల మీదుగా చైనా, జపాన్ వరకు భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి. రుతుపవన ద్రోణి చురుకుగా ఉండి, వేడి గాలులు వాతావరణంలో పైపొరలకు చేరినప్పుడు ఇలాంటి భారీ మేఘాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేఘాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.

35
ఈ నాలుగు రాష్ట్రాల్లో కుండపోతే.. ప్లాష్ ప్లడ్ అలర్ట్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్నాయి. గుజరాత్, అసోం రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలతో వరదల సంభవిస్తున్నాయి. గుజరాత్ వల్సాద్ జిల్లా ఉమేర్‌గావ్‌ ప్రాంతంలో జూలై 22న మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం విరుచుకుపడింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 1064 మిలీమీటర్లు (106 సెం.మీ) వర్షపాతం నమోదయ్యింది. ఇది తెలంగాణ వార్షిక వర్షపాతం కంటే ఎక్కువ. దీన్నిబట్టే ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు.

రాబోయే రోజుల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో నదులు, వాగులు వంకల్లో నీటిప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతుంది.. జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇక భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తోంది IMD. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు. రాబోయే రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ భారీ మేఘాల గొలుసు ఆసియా ఖండంలోని వాతావరణ మార్పులు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో స్పష్టం చేస్తోంది. అరేబియా సముద్రం నుంచి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిన ఒక పెద్ద వాతావరణ వ్యవస్థలో ఇది ఒక భాగమని శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ రుతుపవన వర్షాలు కొనసాగుతాయని అంచనా.

45
తెలంగాణలో భారీ వర్షాలు

ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి... పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో జూలై 26 (ఆదివారం) నుండి వర్షతీవ్రత మరింత పెరుగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని... సౌత్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

అయితే ఇవాళ (జూలై 24, శుక్రవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

55
ఆంధ్ర ప్రదేశ్ లో వానలు

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం (జూలై 24) విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories