
Voter ID card ECI’s new fast-track system: భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్లకు మరింత వేగవంతమైన సేవలను అందించేందుకు కొత్త ఫాస్ట్ట్రాక్ విధానాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం రెండు వారాల్లోనే మీరు ఓటర్ ఐడీ కార్డును పొందుతారు.
ఓటర్ లిస్ట్లో పేరు నమోదు అయిన 15 రోజుల్లోపే లేదా వివరాల్లో మార్పులు జరిగిన తరువాత, ఓటర్ ఐడీ కార్డు (EPIC) ముద్రించిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అభ్యర్థికి పంపిస్తారు.
ఓటర్ ఐడీ కార్డు పొందేందుకు ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడానికి కొత్తగా రూపొందించిన ఐటీ మాడ్యూల్ ECINet పోర్టల్తో అనుసంధానించారు. దీని ద్వారా అభ్యర్థులు వారి ఓటర్ కార్డు (EPIC) అభ్యర్థనను రియల్టైమ్లో ట్రాక్ చేయవచ్చు.
అభ్యర్థికి ఫారమ్ అంగీకారం నుండి కార్డు ముద్రణ, డిస్పాచ్, డెలివరీ వరకు ప్రతి దశలో SMS ద్వారా సమాచారం అందుతుంది.
ఈ మార్పు మాన్యువల్ విధానానికి బదులుగా డిజిటలైజేషన్ ద్వారా 30-45 రోజుల ఆలస్యం నివారించి భద్రత, వేగాన్ని పెంపొందిస్తుందని భారత ఎన్నికల సంఘం తెలిపింది.
ఓటర్ ఐడీ కార్డును ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఈ క్రింది దశలను ఫాలో అవ్వండి.
1. అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in కు వెళ్ళండి.
2. “సైన్ అప్” బటన్ క్లిక్ చేయండి.
3. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరించండి.
4. “Fill Form 6” ఎంపికపై క్లిక్ చేసి, మీ పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలు నమోదు చేయండి.
5. చిరునామా, గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయండి.
6. వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయండి. మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
వెబ్సైట్ ద్వారా ఓటర్ ఐడీ కార్డు (EPIC) డెలివరీ స్థితిని తెలుసుకోవడానికి ఈ దశలు ఫాలో అవండి.
1. https://voters.eci.gov.in లో లాగిన్ అవ్వండి.
2. “Track Application Status” ట్యాబ్ ఎంచుకోండి.
3. మీ ఫారం 6 లేదా 6A రిఫరెన్స్ నంబర్, రాష్ట్రం ఎంపిక చేసి స్టేటస్ చూడండి.
ఈ ట్రాకింగ్ వ్యవస్థ పోస్టల్ శాఖ డెలివరీ మాడ్యూల్తో సమన్వయంగా పనిచేస్తుంది. దాంతో అభ్యర్థికి పూర్తి ప్రక్రియపై ఎప్పటికప్పుడు అవగాహన ఉంటుంది.
• 15 రోజుల్లో EPIC డెలివరీ అవుతుంది.
• రియల్టైమ్ ట్రాకింగ్ ECINet ద్వారా పనిచేస్తుంది.
• ప్రతి దశలో SMS అలెర్ట్స్ వస్తాయి.
• India Post తో సమన్వయంగా పనిచేస్తుంది.
• NVSP పోర్టల్ ద్వారా సులభమైన అప్లికేషన్, ట్రాకింగ్ విధానం తీసుకొచ్చారు.
ఈ విధానం భారత ఎన్నికల వ్యవస్థలో డిజిటల్ మార్పుల దిశగా తీసుకున్న కీలక అడుగుగా నిపుణులు పేర్కొంటున్నారు. త్వరిత సేవలు, పారదర్శకత, బాధ్యతగల విధానం లక్షలాది ఓటర్లకు లబ్ధిని కలిగించనుంది. ఇది డిజిటల్ ఇండియా దిశగా ఎన్నికల సంఘం చేస్తున్న కృషిలో భాగంగా నిలుస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈసీఐ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కొత్త విధానంపై మాట్లాడుతూ.. "ఈ వ్యవస్థ ఓటర్లకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఎలక్షన్ మేనేజ్మెంట్ను ఈ-గవర్నెన్స్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే దిశగా తీసుకున్న కీలక చర్య" అని తెలిపారు.