Delhi Blast: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కారు పేలుడు దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పేలుడు సూత్రధారికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సాయంత్రం 6:50 ప్రాంతంలో ఒక హ్యుందాయ్ i20 కారు ఆకస్మాత్తుగా పేలిపోవడంతో, 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని LJNP ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు, స్పెషల్ పోలీస్ టీములు ఘటన స్థలాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని ఆధారాలు సేకరించారు.
25
డాక్టర్ ఉమర్ మహ్మద్పై అనుమానాలు
పోలీసుల దర్యాప్తులో ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా జమ్మూ కశ్మీర్ పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మహ్మద్ పేరు బయటకు వచ్చింది. అతని తొలి ఫోటో కూడా వెలుగుచూసింది. అయితే, పేలుడులో అతను ప్రాణాలు కోల్పోయాడా లేదా పారిపోయాడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉమర్ గతంలో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో పనిచేశాడు. అతనికి ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్లో ఉన్న ఇతర వైద్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గూఢచార సంస్థలు నిర్ధారించాయి. గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో తాత్కాలికంగా పనిచేసిన తర్వాత, అకస్మాత్తుగా అదృశ్యమవడంతో భద్రతా సంస్థలు అతనిపై నిఘా ఉంచాయి.
35
మూడు గంటల పాటు ఎర్రకోట వద్ద
పేలుడు సంభవించిన హ్యుందాయ్ i20 (HR 26 CE 7674) కారు బడార్పూర్ బోర్డర్ ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించి, మధ్యాహ్నం 3:15 ప్రాంతంలో రెడ్ ఫోర్ట్ సమీపంలోని పార్కింగ్లో నిలిపివేశారు. సాయంత్రం 6:30 వరకు కారును అక్కడే నిలిపివేశారు. కారులో అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, ఇతర పేలుడు పదార్థాలు మిశ్రమంగా ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ప్రాథమికంగా ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు, ఎందుకంటే పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేదు.
ఢిల్లీ, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఫరీదాబాద్లో జరిగిన రైడ్లలో 360 కిలోల పేలుడు పదార్థాలు, ఏకే-47 తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం కావడంతో, ఇది పెద్ద ఉగ్ర కుట్రలో భాగమని అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో ఈ పేలుడు వెనుక పుల్వామా అటాక్ మాడ్యూల్ మిగిలిన నెట్వర్క్ ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. డాక్టర్ ఉమర్తో పాటు తారిఖ్ అనే వ్యక్తి కూడా ఈ కారు లావాదేవీల్లో భాగమయ్యాడని పోలీసులు గుర్తించారు.
55
దేశవ్యాప్తంగా హై అలర్ట్
ఈ పేలుడు తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో ప్రత్యేక బందోబస్తు అమలు చేస్తూ పోలీస్ బలగాలను మోహరించారు. సీసీటీవీ ఫుటేజీలు సేకరించి, పేలుడు క్షణాల ముందు కారును నడిపిన వ్యక్తి ఉమర్ మహ్మద్నేనని పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు పదార్థాలను, వాటి రసాయన నిర్మాణం గురించి విశ్లేషణ చేస్తున్నారు.