
BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బిసిలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 'కులగణన' చేపట్టిన ప్రభుత్వం అందుకు తగినట్లుగా బిసిలకు రిజర్వేషన్లు పెంచాలని చూస్తోంది.. ఇప్పటికే బిసిలకు 29 నుండి 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాదు అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం లభించాల్సిఉంది.
ఇదిలావుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆర్డినెన్స్ ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపింది. కానీ దీనికి తెలంగాణ గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ పై క్లారిటీ కోసమే స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతోంది... కాబట్టి వెంటనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ ఇవాళ(మంగళవారం) పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇక ఇప్పటికే ప్రత్యేక రైలులో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు భారీగా డిల్లీకి చేరుకుంటున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు... ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా డిల్లీకి చేరుకుంటున్నారు. ఇక గురవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు.
ఇలా బిసి రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన దేశప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో ఏ రాష్ట్రంలో బిసిలకు ఎంత రిజర్వేషన్ ఉందనే చర్చ మొదలయ్యింది. కాబట్టి దేశవ్యాప్తంగా బిసిలకు అందుతున్న రిజర్వేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
జాతీయస్థాయిలో OBC (ఇతర వెనుకబడిన తరగతులు) లకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాగే SC (షెడ్యూల్డ్ కులాలు) 15 శాతం, ST (షెడ్యూల్డ్ తెగలు) 7.5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక EWC (ఆర్థికంగా వెనకబడిన వర్గాలు) 10శాతం, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లను అందిస్తోంది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రిజర్వేషన్లే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బిసిలకు 29 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి... తెలంగాణలో కూడా ఇలాగే 29 శాతం బిసిలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత బిసి రిజర్వేషన్ల పెంపుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ 29 శాతం నుండి జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం జనగణన చేపట్టి రిజర్వేషన్ల పెంపుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా బిసి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ బిసి నినాదాన్ని గట్టిగా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అందుకే డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓబిసి రిజర్వేషన్ల పెంపుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది... అందుకే కులగణనకు సిద్దమయ్యింది.
1. తమిళనాడులో అత్యధికంగా బిసిలకు 50 శాతం (OBC 30, MBC 20 శాతం) రిజర్వేషన్ అమలవుతోంది.
2. బిహార్ 33 శాతం ఓబిసి రిజర్వేషన్ అమలుచేస్తోంది.
3. దేశ రాజధాని డిల్లీలో బిసిలకు 27 శాతం రిజర్వేషన్ అమలవుతోంది.
4. గుజరాత్, గోవాలో ఓబిసి రిజర్వేషన్లు 27శాతం
5. హర్యానాలో 23 శాతం బిసి రిజర్వేషన్లు ఉన్నాయి.
6. హిమాచల్ ప్రదేశ్ లో 20, జార్ఖండ్ 14 శాతం బిసి రిజర్వేషన్లున్నాయి.
7. కర్ణాటకలో కూడా అధికంగా 32 శాతం బిసి రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
8. కేరళలలో ఏకంగా 40 శాతం, మహారాష్ట్రలో 32 శాతం బిసి రిజర్వేషన్లు ఉన్నాయి.
9. పంజాబ్ 12, ఒడిషా 11, రాజస్థాన్ 21, సిక్కిం 40 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
10. ఉత్తర ప్రదేశ్ 27, ఉత్తరాఖండ్ 14, పశ్చిమ బెంగాల్ లో 17 శాతం ఓబిసి రిజర్వేషన్లు ఉన్నాయి.