
ప్రస్తుతం మన దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల దాటికి జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. ఇక ఈ సీజన్ లో ఆకలి లేకపోవడం, అజీర్థి, డీహైడ్రేషన్, అలసట, తీవ్రమైన చెమట, హీట్ స్ట్రోక్ , దద్దుర్లు, బొబ్బలు వంటి సమస్యలు ఎదురవుతుంది. వేడి శరీర శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ రోజు వారి ఆహారంలో కొన్ని మసాలాలను నివారించి, కొన్నింటిని జోడించాల్సి ఉంటుంది.
కొన్ని రకాల మసాలా దినుసులు శరీరంలో వేడిని మరింత పెంచితే.. మరికొన్ని మసాలా దినుసులు మాత్రం శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అయితే వేసవిలో కొన్ని రకాల మసాలా దినుసులను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని భావిస్తారు. ఇంతకీ వేసవిలో ఏవి తినాలి, ఏవి తినకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే మసాలా దినుసులు..
దాల్చిన చెక్క.. వేసవిలో దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి పెరిగే ప్రసక్తే ఉండదు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతేకాదు కడుపు మంట, కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
కొత్తిమీర.. కొత్తిమీర ఆకులు శరీరాన్ని చల్లబరిచే గుణాలను కలిగి ఉంటాయి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల శరీర వాపు సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది.
పుదీనా.. దీన్ని మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తాయి. అయితే దీన్ని వేసవిలో తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అజీర్థి నుంచి ఉపశమనం కలిగిస్తుంది కూడా. ఛాతి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే గుండెల్లో మంట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
వేసవిలో తినకూడని మసాలా దినుసులు
అల్లం.. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ అల్లం వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని కొన్ని సార్లైతే విపరీతమైన చెమటను కలిగిస్తుంది. ఈ సీజన్ లో మధుమేహం, రక్తస్రావంతో బాధపడేవారు అల్లం తీసుకోకపోవడమే మంచిది. మోతాదుకు మించి అల్లం తీసుకుంటే కడుపు సమస్యలు, విరేచనాలు, మంట వంటి సమస్యలను ఎదురు కావొచ్చు.
ఎండుమిర్చి.. ప్రతి వంటలో ఎండుమిర్చి లేదా కారం పొడిని తప్పకుండా వేస్తుంటారు. నిజానికి ప్రతిరోజూ కారంపొడిని తినడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది మన శరీరంలో వేడిని పెంచుతుంది. దీంతో చెమటతో పాటుగా కడుపు, ఛాతిలో మంటపుడుతుంది.
నల్లమిరియాలు.. మెటబాలిజం రేటును పెంచడానికి నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి. కానీ వీటిని వేసవిలో మాత్రం మోతాదుకు మించి తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంతేకాదు ఇవి కొన్ని మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. వీటిని ఏదైనా ఔషదంతో పాటుగా తరచుగా తీసుకుంటే అలెర్జీ బారిన పడే అవకాశం ఉంది.
వెల్లుల్లి.. బరువును తగ్గించడానికి , ఆకలిని అణచివేయడానికి , జీవక్రియను పెంచడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. ఇన్ని ప్రయోజనాలున్న వెల్లుల్లిని వేసవిలో మోతాదులోనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన శరీరంలో వేడిని పెంచుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు శ్వాస, రక్తస్రావం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ప్రమాదాలను పెంచుతాయి.
జీలకర్ర.. కడుపు ఉబ్బరానికి జీలకర్ర మంచి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. కానీ ఈ వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగిపోతుంది.