
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో దోశ తినడం అంటే అందరికీ ఇష్టమే. కానీ, ఇంట్లో చేసిన దోశలను పెద్దగా ఎక్కువ మంది ఇష్టపడరు. అదే హోటల్ లో దోశ మాత్రం ఇష్టంగా లాగించేస్తారు. ఎందుకూ అంటే.. హోటల్ లో దోశలు చాలా రుచిగా ఉంటాయి. ఎర్రగా కాలి.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కమ్మగా ఉంటాయి. అదే దోశ మనం ఇంట్లో ట్రై చేస్తే సగం పెనానికీ అతుక్కుపోయి.. పెద్దగా రుచిగా కూడా రావు. అలా దోశ పర్ఫెక్ట్ గా రాకపోవడానికి కారణం.. పిండి సరిగా తయారు చేయకపోవడం. దోశ కోసం నానపెట్టే పప్పులు, బియ్యం సరైన నిష్ప్రత్తిలో వేసి.. సరిగ్గా నానపెడితే.. మీరు కూడా ఇంట్లోనే రుచిగా క్రిస్పీ దోశ తయారు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
1. బియ్యం- 3 కప్పులు, మినపప్పు -1కప్పు, శనగపప్పు-పావు కప్పు, కందిపప్పు -2 టేబుల్ స్పూన్లు, అటుకులు- చిన్న గుప్పెడు, పంచదార- పావు టీస్పూన్, ఉప్పు తగినంత.
దోశ పిండి తయారీ కోసం మనం ముందుగా పప్పులను నానపెట్టుకోవాలి. ముందుగా, బియ్యం, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు,మెంతులను కలిపి కనీసం 4 నుంచి 5 సార్లు నీటితో శుభ్రం చేయాలి. ఇలా కడగడం వల్ల.. వాటిలో ఉన్న అదనపు స్టార్చ్ పోతుంది. పిండి శుభ్రంగా తయారౌతుంది. దీని వల్ల దోశలు మరింత కరకరలాడే అవకాశం ఉంటుంది. ఇలా కడిగిన వాటిని కనీసం 5 నుంచి 6 గంటల పాటు నీటిలో నానపెట్టాలి. మెంతులు దోశకు మంచి సువాసన, మంచి రంగు వస్తుంది. శనగపప్పు, కందిపప్పు వేయడం వల్ల దోశలు ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి.
6 గంటల పాటు పప్పులు నానిన తర్వాత.. వాటిని రుబ్బుకోవడానికి కనీసం 10 నిమిషాల ముందు.. అటుకులను నీటిలో నానపెట్టి.. వాటిని కూడా ఆ పప్పులతో వేసి.. పిండి రుబ్బుకోవాలి. అటుకులు వేయడం వల్ల దోశ లోపల మెత్తగా ఉంటుంది. బయట మాత్రం కరకరలాడుతూ ఉంటుంది. దోశకు మంచి రంగు కూడా వస్తుంది. పిండి రుబ్బుకునేటప్పుడు. మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా చూసుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడు అవసరమైనంత నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ, మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకున్న తర్వాత పిండిలో పావు టీ స్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. చాలా తక్కువ మోతాదులో పంచదార వేయడం వల్ల దోశకు మంచి ఎరుపు రంగు వస్తుంది. ఈ పిండి రుబ్బుకున్న తర్వాత.. మూత పెట్టి.. వెచ్చని ప్రదేశంలో కనీసం 10 నుంచి 12 గంటలు పులియబెట్టాలి. పిండి బాగా పులిస్తే.. దోశలు చాలా తేలికగా వస్తాయి.
చాలా మంది పిండి రుబ్బిన వెంటనే.. ఉప్పు కలిపేస్తూ ఉంటారు.కానీ, ఆ పొరపాటు చేయకూడదు. పిండి పులిసిన తర్వాత.. ఉప్పు కలిపితే దోశలు మరింత రుచిగా ఉంటాయి. మనం దోశ పిండిని రుబ్బుకోవడమే కాదు, పెనం కూడా మంచిగా ఉండాలి. దోశ ఎంత బాగా రావాలన్నా.. పెనం సరైన వేడిలో ఉండాలి. పెనం బాగా వెడెక్కిన తర్వాత మంటను మీడియం తగ్గించి పిండిని పోయాలి. కొద్దిగా నూనె లేదా నెయ్యి చుట్టూ వేస్తే దోశ అంచలు బాగా క్రిస్పీగా వస్తాయి. ప్రతి దోశ తర్వాత పెనాన్ని తడి క్లాత్ తో తుడిస్తే.. తర్వాత వేసే దోశ సమానంగా వస్తుంది. ఒకవేళ మీరు దోశ పిండిని కనుక ఫ్రిజ్ లో స్టోర్ చేసినట్లయితే.... ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన వెంటనే దోశలు వేయకూడదు. కనీసం 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టి.. పిండి నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత... దోశలు వేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే.. దోశలు చాలా రుచిగా, క్రిస్పీగా, ఎర్రగా ఉంచుతాయి.
హోటల్లా కరకరలాడే దోశలు రావాలంటే ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. సరైన బియ్యం–పప్పుల నిష్పత్తి, అటుకుల వినియోగం, పిండిని బాగా పులియబెట్టడం, సరైన ఉష్ణోగ్రతలో దోశ వేయడం వంటి చిన్న విషయాలే పెద్ద తేడాను తీసుకొస్తాయి. ఈ చిట్కాలను పాటిస్తే ఇంట్లోనే ప్రతి సారి గోల్డెన్ బ్రౌన్ రంగుతో, బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే హోటల్ స్టైల్ దోశలను ఆస్వాదించవచ్చు.