ఆయుర్వేదం ప్రకారం కిళ్లీ మంచిదే. ఇందులో వాడే తమలపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ సి, రిబోఫ్లేవిన్, కెరోటిన్, నియాసిన్, క్లోరోఫిల్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కిళ్లీని సరిగ్గా తీసుకుంటే, శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. తమలపాకు, వక్క, సున్నం, సోంపు వంటి వాటితో పాన్ తయారు చేస్తారు. ఇలాంటి కిళ్లీ ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
కానీ కొంతమంది కిళ్లీలో పొగాకు వాడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. అలాగే స్వీట్ పాన్ను ప్రతిరోజూ తినే వాళ్లు ఉన్నారు. స్వీట్ పాన్లో చాలా చక్కెర, గుల్కంద్ వంటి తీపి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. దీన్ని మధుమేహం ఉన్నవారు తింటే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.