నిద్ర అవసరం కాదు అత్యవసరం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నిద్రపోవాలి. అలసి సొలసిన శరీరానికి నిద్రతోనే విశ్రాంతి కలుగుతుంది. తిరిగి ఎనర్జిటిక్ గా తయారవుతుంది. అందుకే ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. నిద్రతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
నిద్ర మనల్ని యమ యాక్టీవ్ గా ఉంచడంతో పాటుగా బరువును కూడా తగ్గిస్తుంది. రోగాలను సైతం సగం వరకు తగ్గిస్తుంది. అందుకే కంటికి తగినంతగా నిద్రపోవాలని సూచిస్తుంటారు. అయితే మధ్యాహ్నం పూట తిన్నవెంటనే మత్తుగా నిద్రరావడం చాలా కామన్. కానీ వేరేవాళ్లు చూస్తే సోమరిపోతులు అనుకుంటారనో మరే కారణం చేతనో చాలా మంది నిద్రను బలవంతంగా ఆపుకుంటారు. కానీ ఇలా చేయడం ఏ మాత్రం మంచిదికాదు. నిద్రను ఆపుకుని వర్క్ చేయడం వల్ల మీరు మీ పనిని సరిగ్గా చేయలేరు. అందకే మధ్యాహ్నం పూట ఓ చిన్న కునుకు తీయండి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరింత చురుకుగా ఉంటారు: పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం వల్ల మీరు మరింత చురుగ్గా ఉంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత మగత మనల్ని పరధ్యానంలో పడేలా చేస్తుంది. ఇది మంచిది కాదు. అందుకే భోజనం చేసిన తర్వాత ఓ చిన్నకునుకు తీయండి. దీనివల్ల మీరు చురుకుగా మారుతారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది: మధ్యాహ్నం నిద్ర విషయాలను బాగా గుర్తుండిపోయేందుకు మీకుు ఎంతో సహాయపడుతుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం కాసేపు నిద్రపోవడం వల్ల ఎలాంటి విషయాలైన గుర్తుండిపోతాయి. ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: మధ్యాహ్నం ఓ చిన్న కునుకు మీ మానసిక స్థితిని మెరుపరచడానికి సహాయపడుతుంది. కొన్నే కొన్ని నిమిషాలు నిద్రపోండి. లేదా కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: మధ్యాహ్నం కొద్ది సేపు నిద్ర పోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పనిలో ఒత్తిడి కలిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని నిమిషాల పాటు కునుకు తీయండి. ఇది మీ రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది.
నిద్రను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది: చాలా మంది రాత్రిపూట కంటినిండా నిద్రపోరు. అందుకే మధ్యాహ్నం ఎక్కువగా నిద్ర వస్తుంది. ఇలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల మీ శరీరం, మెదడు మెరుగ్గా పనిచేస్తాయి.
ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం 20 నిమిషాల పాటు ఒక చిన్న కునుకు తీయడం వల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా పెరుగుతుందట. ఇంగ్లాండ్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం 20 నిమిషాలు నిద్రపోవడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, నిరాశ వంటి సమస్యలను కూడా తగ్గిపోతాయట.