POK: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో అస‌లేం జ‌రుగుతోంది.? ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి ఎందుకొస్తున్నారు.?

Published : Jun 09, 2026, 05:37 PM IST

POK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన బంద్‌కు విశేష స్పంద‌న ల‌భించింది.

PREV
15
పీఓకే వ్యాప్తంగా బంద్.. రహదారులపైకి వచ్చిన ప్రజలు

పీఓకేలో నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఇటీవల మరింత తీవ్రరూపం దాల్చింది. స్థానిక ప్రజలు తమ రాజకీయ హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు మద్ధతు ప్రకటించారు. అనేక పట్టణాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులపై నిరసనకారులు బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, పాక్ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్న భావన ప్రజల్లో బలపడుతోంది.

25
నిరసనలపై కఠిన చర్యలు.. ఘర్షణల్లో ప్రాణనష్టం

నిరసనలను అణచివేసేందుకు పాక్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్థానిక మీడియా ప్రకారం కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగాల కారణంగా పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో 11 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భద్రతా బలగాలకు చెందిన కొందరు అధికారులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

35
12 రిజర్వు సీట్లపై తీవ్ర వ్యతిరేకత

పీఓకే అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వు స్థానాలే తాజా ఆందోళనలకు ప్రధాన కారణంగా మారాయి. ఈ స్థానాల ద్వారా ఇస్లామాబాద్ తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోందని జేఏఏసీ ఆరోపిస్తోంది. స్థానిక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. పీఓకే రాజకీయ వ్యవస్థలో ఇత‌రుల‌ జోక్యం తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

45
ఆర్థిక ఇబ్బందులు, జీవన వ్యయాల పెరుగుదలపై అసంతృప్తి

రాజకీయ అంశాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఆందోళనలకు కారణమయ్యాయి. విద్యుత్ ధరలు, నిత్యావసర వస్తువుల ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు స్థానికుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప్రయోజనాలు స్థానికులకు అందడం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో యువతలో అసంతృప్తి మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

55
అంతర్జాతీయ ఆందోళనలు.. ఇత‌ర దేశాల హెచ్చరికలు

పీఓకేలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించాయి. కొన్ని ప్రాంతాల్లో టెలికం సేవలపై ఆంక్షలు విధించిన‌ట్లు కూడా హెచ్చరించాయి. పరిస్థితులు ఎప్పుడు మారుతాయో చెప్పలేని విధంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

పరిస్థితి ఎటు దారి తీస్తుంది?

పీఓకేలో గత ఏడాది కూడా ఇలాంటి నిరసనలు జరిగినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా కనిపిస్తోంది. రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక హక్కులు, పరిపాలనా స్వేచ్ఛ వంటి అంశాలు కలిసి పెద్ద ఉద్యమంగా మారుతున్నాయి. జేఏఏసీపై నిషేధం విధించినప్పటికీ నిరసనలు ఆగకపోవడం పాక్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందా, లేక మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories