ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య జరిగిన యుద్ధం యావత్ ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన తర్వాత ఈ యుద్ధానికి ముగింపు పడింది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది.
ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ఆయన ప్రజల ముందుకు రాకపోవడం, వేదికలపై కనిపించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో కూడా ఈ అంశంపై స్పష్టత రాలేదు. ఖమేనీ ఆరోగ్యంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఖమేనీ ఆర్కైవ్స్ అధిపతి మెహదీ ఫజైలీ ఎటువంటి స్పష్టతనివ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. “అయన కోసం ప్రార్థించుదాం” అనే మాటలతో మాత్రమే సరిపెట్టారు.
25
ప్రభుత్వ టీవీలో ప్రశ్న.. స్పష్టత లేని సమాధానం
ఇరాన్ అధికార టీవీలో యాంకర్ మెహదీ ఫజైలీని ప్రశ్నిస్తూ, "సుప్రీం లీడర్ ఎలా ఉన్నారు? ఆయన గురించి ప్రజల్లో ఆందోళన ఉంది" అని అడిగారు. దీనికి సమాధానంగా ఫజైలీ, “నన్ను కూడా ఇదే ప్రశ్న చాలామంది అడిగారు.
ప్రజలంతా ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన భద్రతలో ఉన్నారు తమ విధులు నిర్వర్తిస్తున్నారు” అని తెలిపారు. దీంతో అసలు ఖమేనీ సురక్షితంగా ఉన్నారా లేదా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
35
కీలక నిర్ణయాల్లో ఖమేనీ గైర్హాజరు
ఇరాన్లో సుప్రీం లీడర్ సర్వోన్నత స్థానం కలిగిన వ్యక్తిగా కీలక ఆదేశాలు జారీ చేస్తారు. తాజాగా ఇరాన్ పార్లమెంట్ ఐఏఈఏ (అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ) ఒప్పందాల నుంచి వైదొలగాలని నిర్ణయించినా, ఖమేనీ నేతృత్వంలోని సుప్రీం నేషనల్ కౌన్సిల్ నుంచి అనుమతి రాలేదు. ఇది ఆయన లేకుండానే వ్యవస్థ పనిచేస్తుందనే అనుమానాలను బలపరిచింది.
ఇరాన్ అధికారులు ఖమేనీ ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థల నుంచి పూర్తిగా దూరంగా ఉండి, అత్యంత రహస్య బంకర్లో ఉన్నారని వెల్లడించారు. కానీ కాల్పుల విరమణ తర్వాత కూడా ఆయన నుంచి ఏ అధికారిక ప్రకటన వెలువడకపోవడం, మరింత సందేహానికి తావిస్తోంది.
ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఖమేనీని లక్ష్యంగా చేసుకునే కుట్రలు కొనసాగిస్తున్నదని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన భద్రతను మరింత పెంచారని తెలుస్తోంది.
55
ఇజ్రాయెల్ కుట్రల మధ్య మరింత కఠినమైన భద్రత
ఐఆర్జీసీ (ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్) మాజీ కమాండర్ యాహ్య సఫావీ కుమారుడు, రాజకీయ విశ్లేషకుడు హమ్జా సఫావీ మాట్లాడుతూ.. “ఇజ్రాయెల్ ఇంకా ఖమేనీపై హత్యాయత్నానికి ప్రయత్నం జరుగుతోంది. దీంతో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా మారింది.
చాలా తక్కువ మందితో మాత్రమే ఆయన ప్రత్యక్షంగా సమావేశమవుతున్నారు” అని పేర్కొన్నారు. మరి ఖమేనీ ఎలా ఉన్నారు.? ఆయన ఎందుకు అజ్ఞాతనంలో ఉన్నారన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇరాన్ అధికారికంగా స్పందించే వరకు చూడాలి.