
అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించిన విషయం తెలిసిందే. టెహ్రాన్లో కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా మృతిచెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఘటన తర్వాత ఇరాన్ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనిని “పెద్ద తిరుగుబాటుకు ఆరంభం”గా అభివర్ణించింది. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త వెలువడిన వెంటనే భారత్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చారు. ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలు, భారత్ వైఖరి, హైదరాబాద్కు ఉన్న సంబంధం వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖమేనీ షియా ముస్లింలకు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా. అందుకే ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా షియా సమాజాన్ని కలిచివేసింది. జమ్మూ కశ్మీర్లో పలు వందలాది మంది ర్యాలీలు నిర్వహించారు. ఖమేనీ ఫొటోలు పట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో భారత్కు ఇరాన్ లీడర్కు సంబంధం ఏంటన్న చర్చ మొదలైంది
భారత్లో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఇరాన్ మతపరంగా ముఖ్య కేంద్రం. ఖమేనీని వారు తమ ఆధ్యాత్మిక నాయకుడిగా భావిస్తారు. అందుకే ఆయన మరణాన్ని తమపై జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ కారణంగానే భారత్లో ఉన్న షియా ముస్లింలు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు.
హైదరాబాద్లో కూడా షియా సమాజం గణనీయంగా ఉంది. పాతబస్తీ ప్రాంతాల్లో ఇరాన్ పట్ల భావోద్వేగ అనుబంధం ఎక్కువగా ఉంటుంది. మతపరమైన సభలు, ప్రార్థనలు నిర్వహించి ఖమేనీకి సంతాపం తెలిపారు.హైదరాబాద్ చారిత్రకంగా షియా ప్రభావం కలిగిన నగరం. ఇరాన్తో సాంస్కృతిక అనుబంధం ఉంది. అందుకే అక్కడ కూడా ఈ ఘటనపై స్పందన కనిపించింది.
ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖమేనీ హత్యపై స్పందించలేదు. కేవలం ఈ ఉద్రిక్తత పశ్చిమ ఆసియా పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని మాత్రమే పేర్కొన్నారు. ఇది భారత్ విదేశాంగ విధానంలో భాగం. భారత్ సాధారణంగా అంతర్జాతీయ ఘర్షణల్లో ఏ వైపునా బహిరంగంగా నిలబడదు. సంభాషణ, శాంతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలనే విధానాన్ని అనుసరిస్తుంది.
భారత్కు ఇరాన్తో చాబహార్ పోర్ట్ ప్రాజెక్టు వంటి వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికాతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. ఒక వైపు నిలబడితే మరో వైపు సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే “మౌనం” పాటిస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు, వ్యూహాత్మక సమతౌల్యం అని కేంద్రం భావిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం విస్తరితే చమురు ధరలు పెరగవచ్చు. అది భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయితే భారత్ లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉంది. పశ్చిమ ఆసియాలో శాంతి కావాలి. అక్కడ ఉన్న భారతీయుల భద్రత కాపాడాలి. చమురు సరఫరా అంతరాయం రాకూడదు. ఖమేనీ మరణం భారత్లోని షియా సమాజాన్ని భావోద్వేగంగా కదిలించింది. కానీ ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశ ప్రయోజనాలే ప్రాముఖ్యం అని కేంద్రం తన చర్యలతో సందేశాన్నిచ్చింది.